దొరల రాజ్యాన్ని గద్దె దింపాలి- ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి: రేవంత్​రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 5:42 PM IST

thumbnail

Revanth Reddy at Narayankhed Public Meeting : అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించడంలో కేసీఆర్‌తో ఎవరూ పోటీ పడలేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎక్కడికి వెళ్లినా కుర్చీ వేసుకుని కూర్చొని పనులు చేపిస్తానని కేసీఆర్(CM KCR) చెప్పారని వ్యాఖ్యానించారు. కానీ ఈ పదేళ్లలో కేసీఆర్‌ ఎప్పుడూ బయటికి వెళ్లింది లేదని.. పనులు చేయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు బిల్లులు రావాలంటే బీఆర్ఎస్​కు బుద్ధి చెప్పాలని సూచించారు.

Revanth Reddy Election Campaign in Narayankhed : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దొర గడీలోకి వెళ్లి సమస్యలు చెప్పే అవకాశం ఉందా? అని ప్రజలను రేవంత్ ప్రశ్నించారు. తన గడీలోకి ఎమ్మెల్యేలను కూడా రానివ్వని కేసీఆర్‌ ప్రజల సమస్యలు ఎలా వింటారని ఆరోపించారు. ప్రగతి భవన్ పేరుతో గడీని నిర్మించుకుని ఎవరికీ ప్రవేశం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. డిసెంబర్‌ 9న కచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రగతిభవన్‌ను(Pragathi Bhavan) అంబేడ్కర్‌ భవన్‌గా మార్చి.. ప్రజా దర్బార్‌ పెడతామని చెప్పారు. అంబేడ్కర్‌ భవన్‌లో ప్రజల సమస్యలు నేరుగా వింటామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు లేదని గుర్తుచేశారు. వచ్చే నెల నుంచి పేదలకు రూ.4 వేల పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. దొరల రాజ్యాన్ని గద్దె దింపాలని.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని ప్రజలకు రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.