రేవంత్రెడ్డి సభలో అపశృతి - మైక్ స్టాండుపై నుంచిపడి వ్యక్తి తలకు గాయం
Published : Nov 26, 2023, 6:57 PM IST
Narayanpet Congress Sabha Fight : నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో అపశృతి చోటుచేసుకుంది. మైకుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప స్టాండుపైకి ఎక్కి కింద పడిన ఓ వ్యక్తి తలకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అప్పటికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభకు చేరుకోలేదు.
సభలో మైకుల ఏర్పాటు కోసం కొన్ని చోట్లు దాదాపు 20 అడుగుల ఎత్తులో స్టాండ్లు పెట్టారు. దానిపైకి ఓ వ్యక్తి ఎక్కాడు. కిందకి దిగాలని ఎంత వారించిన దిగలేదు. మరో వ్యక్తి పైకి ఎక్కే క్రమంలో పైన ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. సభ అనంతరం కొందరు మధ్య తోపులాట జరిగింది. కోపోద్రిక్తులైన యువకులు కుర్చీలతో కొట్టుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేశారు.