ఉమ్మడి వరంగల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తతలు - పోలీసుల లాఠీ ఛార్జీ - Clash at Mahabubabad polling station
🎬 Watch Now: Feature Video


Published : Nov 30, 2023, 6:38 PM IST
Clash At Warangal Polling Station : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తలెత్తిన గొడవ లాఠీఛార్జ్కు దారి తీసింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మైలారం గ్రామంలోని పోలింగ్ బూత్ల సందర్శనకు వెళ్లగా అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఎర్రబెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అది చూసిన బీఆర్ఎస్ శ్రేణులు, మంత్రి అనుచరులు వారితో వాదనకు దిగారు. వాదన కాస్త ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అప్పటివరకు ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్ ఇరువర్గాల మధ్య చెలరేగిన గొడవ వల్ల ఓటర్లు భయంతో పరుగులు తీశారు.
Clash At Mahabubabad Polling Station : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లిలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించేందుకు ఎమ్మెల్యే రెడ్యానాయక్ లోపలికి వెళ్లారు. ఆయనతో పాటు మరికొందరు కేంద్రంలోకి వెళ్లడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణతో పోలింగ్ కేంద్రంలో ఒక్కసారి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలని బయటకు పంపించారు. అనంతరం రహదారిపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు చేశారు. పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్జి పాటిల్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.