కరోనా మహమ్మారి ఆరోగ్యపాఠాలు బాగా నేర్పింది. వ్యాయామం అంటే బద్దకించే చాలామంది యోగ, ప్రాణాయామం, నడక, పరుగు, జిమ్లకు వెళ్తున్నారు. ఇంట్లోనే జిమ్ పరికరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏడాది వ్యవధిలో 40-45శాతం వ్యాయామ పరికరాల కొనుగోళ్లు పెరిగినట్టు సోమాజిగూడలోని ఒక దుకాణ నిర్వాహకుడు తెలిపారు. కానీ అతి వ్యాయామం, ప్రాణాయామం, కషాయాలు తీసుకోవటం పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. మోతాదు మించి వేడినీరు, కషాయం వంటివి తీసుకోవటం వల్ల ఎసిడిటీ, కడుపునొప్పి, వాంతులు, విరోచనాల ఇబ్బందులు పడుతున్నారని ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ సునీతాజోషి హెచ్చరించారు.
స్వీయ జాగ్రత్తలు.. వైరస్పై అస్త్రాలు
- శీతాకాలం-వేసవికాలం సహజంగానే రోగనిరోధశక్తి తగ్గుతుంది
- సామాజిక మాధ్యమాల్లో వచ్చే వైద్యసూచనలతో విచ్చలవిడిగా మాత్రలు వాడవద్దు
- ఆయుర్వేద కషాయమే కదా! అని తరచూ తీసుకోవద్దు.
- దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం, పసుపు, లవంగాల కషాయం 30 మి.లీ వరకూ తీసుకోవచ్చు.
- వెల్లుల్లి, అల్లం, పసుపు, దనియాలు, మిరియాలు వంటివి ఆహార పదార్థాల్లో విధిగా ఉండేలా చూడండి
- విటమిన్-సి కోసం ఉసిరికాయ ఉత్తమం. మార్కెట్లో వివిధ రూపాల్లో దొరుకుతుంది.
- గుడూచి(తిప్పతీగ) రసాయనంగా ఉపకరిస్తుంది.
- అశ్వగంథ లేహ్య, మాత్ర, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
- నీలవేము కరోనా పాజిటివ్ వచ్చిన వారికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎక్కువగా విష జ్వరాలకు వాడుతుంటారు.
- చ్యవన్ప్రాశ బ్రహ్మ రసాయనం అంటారు. ఉదయం, సాయంత్రం తీసుకోవచ్చు.
మేలు చేసే అలవాట్లు
- మంచి ఆహారపు అలవాట్లు. సమయానికి తగినట్టుగా తీసుకోవాలి
- సరిపడా నిద్ర, యోగ, ప్రాణాయామం, శారీరక శ్రమ రోగాల బారినపడకుండా కాపాడతాయి
- ఇంట్లో తయారు చేసిన శుచికరమైన ఆహారం మితంగా తీసుకోవాలి.
ఇదీ చదవండి: ఎండిపోతున్న పంటలు.. కర్షకులకు తప్పని కన్నీళ్లు