ప్ర. నీతి అయోగ్ ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా అవార్డుకు ఎంపికైనందుకు అభినందనలు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 75 మందిలో స్థానం సాధించటం ఎలా అనిపిస్తోంది?
జ. సంతోషంగా ఉంది. దేశవ్యాప్తంగా 75 మందిని ఎంపిక చేశారు. అందులో నేను ఉండటం సంతోషంగా ఉంది. ఇది చాలా అరుదైన గౌరవంగా భావిస్తున్నాను.
ప్ర. గత పదేళ్లుగా భారత్లో జెనెటిక్స్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. అసలు జీనోం స్టడీ చేసే సంస్థ స్థాపించాలన్న ఆలోచన ఎప్పుడు, ఎలా వచ్చింది?
జ. దాదాపు 20 ఏళ్లుగా జీనోమిక్స్లో ఉన్నాను. 2000 సంవత్సరంలో ఆసిమం బయోసొల్యూషన్ ప్రారంభించాను. 2013 వరకు దీనిని నిర్వహించిన తర్వాత పర్సనలైజ్డ్ మెడిసిన్కు ప్రాముఖ్యత ఏర్పడుతోందని అర్థమైంది. ఈ నేపథ్యంలో మన దేశ ప్రజలకు ఏమైన చేయాలనుకున్నాం. వ్యాధి నివారణపై దృష్టి సారించటంతోపాటు... అందరికీ అందుబాటులో ధరల్లోనే టెస్టులను తీసుకురావాలనుకున్నాం. అలా 2013లో మ్యాపై మై జీనోం ప్రారంభించి జీనోం పత్రి పేరుతో ఆన్ లైన్ ద్వారా మొట్టమొదటి సారిగా జీనోం టెస్టింగ్ కిట్ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఆ కిట్ సహాయంతో ఇంట్లోనే ఎవరికి వారే స్వాబ్తో టెస్టు చేసుకుని ఆ సాంపిల్ను మాకు పంపితే చాలు. పరీక్షించి ఫలితాలు ఈమెయిల్ లేదా కొరియర్ ద్వారా పంపుతాం.
ప్ర. జీనోం పత్రి పరీక్ష ద్వారా ఏఏ విషయాలు తెలుసుకోవచ్చు?
జ. జీనోం పత్రి టెస్టు ద్వారా లైఫ్ స్టైల్, పోషకాహారం, కుటుంబ పరంగా ఉన్న వ్యాధులు ఇతరత్రా దాదాపు 100 రకాల వ్యాధులు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఏ మేరకు ఉందన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటికి సంబంధించిన జన్యుపరంగా ఎంతవరకు అవకాశం ఉందని చెప్తాం. అన్ని మందులు అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఉదాహరణకు మెట్ ఫార్మిన్... షుగర్ వ్యాధికి ఇచ్చే ఈ మందు కొందరికే పనిచేస్తుంది. మరి కొందరి శరీరం అసలు దీనికి స్పందించదు. ఎవరికి ఏ మందు ఎలా పనిచేస్తుందన్న విషయాలను జన్యు పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితంగా అనవసరమైన మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక మరికొందరికి తమ మూలలను తెలుసుకోవాలని ఉంటుంది. మన పూర్వీకులు ఏ తెగకు చెందిన వారు, మన మూలలు ఎక్కడ ఉన్నాయన్న వివరాలను సైతం ఈ పరీక్షల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.
ప్ర. కొవిడ్ సమయంలోనే మ్యాప్మై జీనోం సంస్థ సాధారణ ప్రజలకు చాలా దగ్గరైంది? నిత్యం వందల సంఖ్యలో సాంపిళ్లను పరీక్షలు చేశారు. ఎయిర్ పోర్ట్లో మీ కేంద్రాలను నిర్వహించటం ఎలాంటి అనుభవానిచ్చింది?
ప్ర. సాధారణంగా మేం ఇలాంటి వైరస్లకు సంబంధించిన పరీక్షలు చేయం. అయితే మేం చేసే ఇతరత్రా పరీక్షలకోసం వాడే పరికారలతోనే ఈ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయొచ్చు. మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో మా వంతు సాహాయం చేయాలని ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసేందుకు ముందుకు వచ్చాం. ముందుగా కార్పొరేట్ స్థాయిలో ఈ టెస్టింగ్ ప్రారంభించాం. ఆ తర్వాత కర్ణాటక, ఏపీల్లో టెస్టింగ్ చేసి చివరిగా ఎయిర్ పోర్ట్లలో మా కేంద్రాలు ఏర్పాటు చేశాం. అలా నగరానికి వచ్చే చాలా మందికి మ్యాప్ మై జీనోం సంస్థ గురించి తెలిసింది.
ప్ర. పర్సనలైజ్డ్ మందుల తయారీలో జెనెటిక్స్ ఏ మేరకు ఉపయోగపడతాయి?
జ. ఇటీవల ఎఫ్డీఐ క్యాన్సర్కు సంబంధించి జన్యు సంబంధమైన అనేక రకాల మందులకు అనుమతులు ఇచ్చింది. అయితే 2000 సంవత్సరంలోనే జీన్ లాజిక్స్ అనే సంస్థను కొనుగోలు చేసి... మేం పర్సనలైజ్డ్ మందులపై పరిశోధనలు చేశాం. జన్యువులను అధ్యయనం చేసి వ్యాధుల రిస్క్ గురించి వివరిస్తాం. దీనినే పాలిజెనిక్ రిస్క్ స్కోరింగ్గా చెప్తాం. మేం ఎప్పటి నుంచో ఈ రిస్క్ స్కోర్ను అందిస్తున్నాం... అయితే ఇటీవల కాలంలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. మాకు పాలిజెనిక్ రిస్క్ స్కోర్కి సంబంధించిన పేటెంట్ కూడా ఉంది. ఇప్పుడు మేము జీనోమిక్స్ని బయోకెమిస్ట్రీకి జత చేసి పరీక్షలు చేస్తున్నాం. ప్రపంచంలో ఇది చేస్తున్న మొట్టమొదటి సంస్థ మ్యాప్ మై జీనోమే. ఇందుకోసం బెంగళూరు, దిల్లీల్లో ల్యాబ్లు ఏర్పాటు చేశాము. ముందుగా కొన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించి ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితిని అంచనావేస్తాం. దానికి మీ జెనెటిక్ రిపోర్టులను జత చేయటం ద్వారా భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితులపై పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.
ప్ర. భారత్తో పోలిస్తే విదేశాలు జెనెటిక్ పరీక్షల విషయంలో చాలా ముందంజలో ఉన్నాయి. భారత్లో వీటిని ఎందుకని పెద్దమొత్తంలో వినియోగించుకోవటంలేదంటారు?
జ. యూఎస్ లాంటి దేశాల్లో జెనెటిక్ టెస్టులకు ఇన్స్యూరెన్స్ సంస్థలు రీఎంబర్స్మెంట్ ఇస్తాయి. అక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఇక్కడితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇక ఇక్కడ జీనోమిక్ సంస్థలకి పెట్టుబడులు కూడా చాలా తక్కువ. 2005 లోనే చైనా చాలా పెద్ద మొత్తం నిధులను జన్యు పరిశోధనల కోసం కేటాయించింది. మన దగ్గర ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. మన వినియోగదారులు డబ్బుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఒక్కసారి జెనెటిక్ టెస్టులకు ఖర్చు చేస్తే కలిగే ప్రయోజనాలను వారు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు.
ప్ర. జన్యు పరీక్షలు అనగానే చాలా ఖర్చవుతుందన్న అభిప్రాయం ఉంది. నిజంగా జెనెటిక్ టెస్టులకు అంత ఖర్చవుతుందా. అనారోగ్యం భారినపడి పెట్టే ఖర్చుతో పోలిస్తే ఇది ఏ మేరకు ఉపయోగపడుతుందంటారు?
జ. నిజానికి తొలినాళ్లలో జన్యు పరీక్షలు కొంత ఎక్కువగ ఖర్చు అయ్యేది. 2013లో జన్యు పరీక్షల రుసుం 25000 వేలు ఉంది. కానీ కాలంతో పాటు ధరలు తగ్గాయి. ఇప్పుడు కేవలం 6500 రూపాయలకే జన్యు పరీక్షలను అందిస్తున్నాం. ప్రపంచంలోనే అతి తక్కువ ధరలకు జన్యు పరీక్షలను అందస్తున్న సంస్థ మాదే. ఒక్క పరీక్షతో జన్యు రిపోర్టుతో పాటు.... కౌన్సెలింగ్, సెకండ్ రిపోర్ట్ వంటి వాటిని అందిస్తున్నాము. సాధారణ ప్రజలకు జన్యు పరీక్షలు అందాలన్నదే మాలక్ష్యం. వాస్తవానికి మనం ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్కు వెళ్తాం. ఆరోగ్య పరీక్షలు చేయిస్తాం. కానీ ఇది జీవిత కాలంలో ఒక్కసారి పరీక్ష చేయిస్తే సరిపోతుంది. అలా చూస్తే జన్యు పరీక్షలు చాలా తక్కువ ఖర్చు అవుతున్నాయి. దానికి తోడు జెనెటిక్ టెస్టులు అంటే ఏదైనా వ్యాధి వస్తే చేస్తారు... లేక తల్లిదండ్రుల వివరాలు తెలుసుకునేందుకు చేస్తారు అనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి టెస్టు కోసం చాలా మంది ముందుకు రారు.
ప్ర. సాధారణంగా ఒక్కసారి జన్యు పరీక్ష చేయిస్తే మనిషి ఆరోగ్యానికి సంబంధించి ఎన్ని రకాల వివరాలు తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఎన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని అంచనా వేయొచ్చు?
జ. జన్యు పరీక్షలకు సంబంధించిన మా దగ్గర అనేక రకాల టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. జీనోం పత్రి కిట్ ద్వారా 100 రకాల వ్యాధుల ప్రమాదాన్ని తెలుసుకోవచ్చు. మెడికా మ్యాప్ ద్వారా 150 రకాల వ్యాధులు, మై ఫిట్ జీనోం, మై న్యూట్రీ జీనోం వంటి టెస్టులను ఎంపిక చేసుకోవటం ద్వారా 30 నుంచి 40 రకాల వ్యాధులు, ఆరోగ్య పరిస్థుల గురించి తెలుసుకోవచ్చు. ఒక్క చిన్న టెస్టు ద్వారా దాదాపు 400 రకాల వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు. మన శరీరంలో సరైన మోతాదులో విటమిన్స్, ప్రోటీన్స్ వంటివి సరిగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు.
ప్ర. బరువు తగ్గటంలోనూ, పోషకాహార లోపాలను సవరించుకునేందుకు ఈ పరీక్షలు ఏ మేరకు ఉపయోగపడతాయి?
జ. నాకు స్థూలకాయం, డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నా జన్యు పరీక్షల సమయంలో నాకు ఆ విషయం తెలిసింది. అప్పటి నుంచి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటుంన్నా. దీంతో నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగా.
ప్ర. జన్యు పరీక్షలు ప్రతి ఒక్కరికీ అవసరం అయినప్పటీకి ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన వీటిని చేయించుకోవాల్సిన అవసరం ఏమేరకు ఉందంటారు..?
జ. ప్రస్తుతం మహిళల్లో రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ సమస్యలు సహా... ఎండోమెట్రియాసిస్ వంటివి బాగా పెరుగుతున్నాయి. అందుకే మహిళలు తప్పక జెనెటిక్ టెస్టు చేయించుకోవటం ద్వారా తమని తాము దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని దీర్ఘకాలంపాటు కాపాడుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది.
ఇదీ చదవండి : మన ఆరోగ్యం మన బాధ్యత.. అందుకే ఈ మార్పులు తప్పనిసరి.!