వ్యాధి నిరోధక శక్తి పెంచే సమతుల్య ఆహారం అవసరం. ముఖ్యంగా విటమిన్ సి, బి12, డి కీలకం. నిమ్మ, దానిమ్మ, కమలాలు తదితర పండ్ల ద్వారా సి విటమిన్ పుష్కలంగా అందుతుంది. మాంసకృత్తుల కోసం వారంలో రెండుసార్లు చికెన్, నిత్యం ఒక గుడ్డు తీసుకోవాలి. సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, చిరు ధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. కరోనా సోకిన వారిలో మొదటి వారం రోజులపాటు నిస్సత్తువ ఉంటుంది. జ్వరం ఉంటే మాంసకృత్తులు జీర్ణం కావు. కాబట్టి ఆకలి వేసే వరకు రాగి, జొన్న, బియ్యంతో చేసిన జావలు, సలాడ్లు, సూప్లు, డ్రైఫూట్స్ ఇతర తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వీటివల్ల నిస్సత్తువ తగ్గుతుంది. డీహైడ్రేషన్ ప్రమాదం కూడా తప్పుతుంది. ఆకలి పెరిగిన తర్వాత అన్ని రకాల ఆహారాన్ని తీసుకోవచ్చు. ఫలితంగా తొందరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.

విచ్చలవిడిగా విటమిన్లు వద్దు..
కరోనా రాకుండా విటమిన్లు, ఇతర పోషకాల కోసం చాలామంది మాత్రలు మింగుతుంటారు. వైద్యుల సూచనల మేరకు వాటిని తీసుకోవాలి. అవసరం లేకుండా విచ్చలవిడిగా విటమిన్ మాత్రలు వాడితే ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల గొంతులో సమస్య ఉంటే పోతుంది. తల బరువుతోపాటు జలుబు లాంటివి ఉంటే రోజుకు కనీసం రెండుసార్లు 10-15 నిమిషాల చొప్పున ఆవిరి పట్టుకోవాలి. వారం రోజులపాటు చేయాలి.

అలా నెగెటివ్ వచ్చినా..
ర్యాపిడ్ యాంటిజన్లో పాజిటివ్ వచ్చి... ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వచ్చినా తప్పనిసరిగా ఏడు రోజులపాటు హోం ఐసొలేషన్లో ఉండాలి. అప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోతే మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకొని వైద్యుల సూచనల మేరకు నిర్ణయం తీసుకోవాలి.

వైరస్ సోకిందన్న అనుమానం వచ్చిన వెంటనే ఇల్లు, కార్యాలయాల్లో ఇతరులకు దూరంగా ఉండాలి. హోం ఐసొలేషన్లో ఉంటూ మాస్క్ ధరించాలి. తొలుత ర్యాపిడ్ యాంటిజన్ పరీక్ష.. అందులో అనుమానం ఉంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. చిన్న లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం చేయొద్దు.

రక్తంలో ఆక్సిజన్ 95 శాతం ఉండాలి. అంతకంటే తగ్గిందంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అంతమాత్రాన వెంటిలేటర్పైకి వెళ్లినట్లు కాదు. వైద్యుల సూచనలతో ముందుకు వెళ్లాలి. ఆక్సిజన్తో పాటు ఇతర మందులు అందిస్తే తిరిగి కోలుకుంటారు. ఆక్సిజన్ 80 శాతానికి వచ్చినా.. చికిత్స తీసుకొని ఎంతోమంది ప్రాణాపాయం నుంచి బయట పడుతున్నారు.

ఇవీ చూడండి: