మధుమేహం ఉన్నవారు.. పుచ్చకాయ తినొచ్చా? లేదా అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. అది తీయగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే.. ఈ విషయంలో మరీ భయపడాల్సిన పనేమీ లేదంటున్నారు వైద్య నిపుణులు. ఆయా పదార్థాల్లోని గ్లూకోజు రక్తంలో ఎంత వేగంగా కలుస్తోందనేదాన్ని ఒక సంఖ్యతో సూచిస్తారు. దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్(జీఐ) అంటారు. ఇది అధికంగా ఉండే పదార్థాల విషయంలో మధుమేహులు జాగ్రత్తగా ఉండటం మంచిదే.
గ్లూకోజు స్థాయిలు పెరిగినా..
పుచ్చకాయ జీఐ 72. నిజానికిది దాదాపు కూల్డ్రింక్తో సమానమే అయినప్పటికీ పుచ్చకాయలో పిండి పదార్థం చాలా తక్కువ. సుమారు 100 గ్రాముల పుచ్చకాయ ముక్కల్లో ఉండే పిండి పదార్థం 7 గ్రాములే. అంటే 100 గ్రాములు తిన్నా కూడా ఒక బ్రెడ్డు ముక్కతో సమానం కాదన్నమాట. పైగా ఇందులో నీటి శాతం ఎక్కువ. అందువల్ల పుచ్చకాయను తిన్నప్పుడు వెంటనే గ్లూకోజు పెరుగుతుంది. కానీ.. మరీ ఎక్కువసేపు అలాగే ఉండక, త్వరగానే తగ్గుతుంది. అంటే తాత్కాలికంగానే గ్లూకోజు స్థాయులు పెరుగుతాయన్నమాట.
లాభాలెన్నో..
పుచ్చకాయలో ఒక్క పిండి పదార్థమే కాదు.. విటమిన్ ఎ, విటమిన్ బి1, బి6, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, పీచు, ఐరన్, క్యాల్షియం, లైకోపేన్ వంటి పోషకాలూ ఉంటాయి. విటమిన్ ఎ- గుండె, కిడ్నీలు, కళ్లు, ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. విటమిన్ సి- శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందిస్తూ జబ్బులు, ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుతుంది. పుచ్చకాయ గుజ్జుకు ఎర్రటి రంగునిచ్చే లైకోపేన్ సైతం యాంటీఆక్సిడెంటే. ఇక దీనిలోని పీచు జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఎక్కువసేపు కడుపునిండిన భావన కలిగిస్తుంది. మెగ్నీషియం, పొటాషియం రక్త ప్రసరణ మెరుగుపడేలా, కిడ్నీలు సరిగా పనిచేసేలా చేస్తాయి. అంతేకాదు, దీనిలోని సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం రక్తపోటు తగ్గటానికి, జీవక్రియలు చురుగా సాగటానికి తోడ్పడుతుంది. ఇవన్నీ మధుమేహులకు మేలు చేసేవే. ఒక్క గ్లూకోజు భయంతో పుచ్చకాయ తినటం మానేస్తే ఇలాంటి ప్రయోజనాలన్నీ కోల్పోయినట్టే అవుతుందని నిపుణులు అంటున్నారు.
ఇదీ చదవండి: పండంటి కిడ్నీకి 12 సూత్రాలు!