యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో సహజ సిద్ధమైన కొండ ప్రాంగణాలతో పాటు పచ్చదనంతో కూడిన పల్లెటూరి వాతావరణం నెలకొల్పేలా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మన సంస్కృతిని చాటే కలశ రూపం అదనపు ఆకర్షణగా మారింది. కొండపై ప్రాంగణాన్ని ఆధ్యాత్మి కంగా రూపొందిస్తున్నారు. కొండకింద ఆలయ పరిసరాలను గ్రామీణ వాతావరణం ప్రస్ఫుటమయ్యేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుసార్లు దిశానిర్దేశం చేశారు.
హరితమయం
క్షేత్రమంతా హరితమయం
![yadadri, sri lakshmi narasimha swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12295470_yadadri-2.png)
సీఎం ఆదేశాలతో కొండకింద ఉత్తరదిశలోని ప్రెసిడెన్షియల్ సూట్ల వద్ద వలయదారి ప్రాంగణంలో ఈత, కొబ్బరి, పొన్న, నాగవళి చెట్ల పోషణకు 15 రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. ఆధ్యాత్మికత, ఆహ్లాదాన్ని కలిగించే తరహాలో హరితమయంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేపట్టారు. క్షేత్ర సందర్శనకు వచ్చే వీవీఐపీలు బస చేసే ప్రెసిడెన్షియల్ సూట్ల వద్ద ఎక్కడా లేని విధంగా మొక్కలను పూజలో వినియోగించే "కలశం" ఆకారంలో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు.
సంస్కృతి ఉట్టిపడేలా..
పల్లెటూరి వాతావరణం
![yadadri, sri lakshmi narasimha swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12295470_yada.png)
గిరి ప్రదక్షిణ దారిలోనూ ఏపీ నుంచి తెప్పించిన వివిధ మొక్కలను పెంచుతున్నారు. ముఖ్యమంత్రి సూచనలతో చేపట్టిన ఈ పనుల తీరుపై సీఎంవో భూపాల్ రెడ్డి ఎప్పటికపుడు సమాచారం సేకరిస్తున్నారు. ఈ క్షేత్ర సందర్శన కోసం వచ్చే దేశ, విదేశీయులకు ఆధ్యాత్మిక ఆహ్లాదంతో సహా మన సంస్కృతిని చాటేలా కొండకింద గండి చెరువు పరిసరాలు, వలయదారి, గిరి ప్రదక్షిణ దారులు పచ్చగా మార్చేందుకు కసరత్తులు ముమ్మరమయ్యాయి.
సీఎం ప్రత్యేక దృష్టి
వివిధ రకాల మొక్కల పెంపకం
![yadadri, sri lakshmi narasimha swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-84-28-yadadri-spl-haritha-shobha-av-ts10134_28062021225410_2806f_1624901050_444.jpg)
హరిహరుల ఆలయాల పునర్నిర్మాణం పనులు పూర్తి కావొస్తున్నందున ఉద్ఘాటనపై ముఖ్యమంత్రి దృష్టిసారించారు. ఆ దిశలో 15వ సారి ఈ క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణాలు, ఉద్ఘాటనపై కీలక నిర్ణయానికి రానున్నట్లు ‘యాడా’ భావిస్తోంది. క్షేత్రాభివృద్ధి కోసం ఇప్పటివరకు రూ.840 కోట్లు ఖర్చు కాగా, కొండపై పునర్నిర్మితమైన పంచనారసింహుల సన్నిధి, పర్వతవర్ధిని సహిత రామలింగేశ్వరస్వామి(శివాలయం) ఆలయాలకు రూ.240 కోట్ల ఖర్చయినట్లు యాడా వైస్ ఛైర్మన్ కిషన్రావు తెలిపారు.
కృష్ణశిలలతో...
యాదాద్రి, శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయం
![yadadri, sri lakshmi narasimha swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-84-28-yadadri-spl-haritha-shobha-av-ts10134_28062021225410_2806f_1624901050_764.jpg)
పూర్తిస్థాయిలో కృష్ణశిలతో ప్రధాన ఆలయ పునర్నిర్మించారు. అష్టభుజ మండప ప్రాకారాలు, రాజగోపురాలు, దివ్య విమానం, ఆళ్వారుల మండపం అద్భుతంగా నిర్మించారు. గర్భగుడి మహాద్వారంపై ప్రహ్లాద చరిత్ర, భక్తాగ్రేసరుల విగ్రహ రూపాలు ఈ క్షేత్ర విశిష్టతను నలుదిశలా చాటనున్నాయి.
ఇదీ చదవండి: జల్సాలకు బానిసైన చెల్లి.. చివరికి అక్క ఇంట్లోనే..