Yadadri Maha Kumbha Samprokshanam: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణం అనంతరం.. ఆలయ మహాకుంభ సంప్రోక్షణ క్రతువుల్లో భాగంగా నిర్వహిస్తున్న పంచకుండాత్మక మహాయాగం ఆరో రోజుకు చేరుకుంది. స్వామి వారికి పంచకుండాత్మక సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం ప్రధానాలయంలో పాటు బాలాలయంలో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం.. శాంతిపాఠంతో ప్రారంభమై చతు:స్థానార్చన, ద్వారా తోరణ, ధ్వజ కుంభారాధన, మూల మంత్ర హావనములు, ఏకాశీతి కలశాభిషేకం, పూర్ణాహుతి చేపట్టారు.
![Yadadri Maha Kumbha Samprokshanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14843251_kunda.jpg)
వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీత, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం.. వేదపండితులు చతు:స్థానార్చనలు, ధాన్యాధివాసం, సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాలు, నిత్య లఘు పూర్ణాహుతి పూజలు నిర్వహించనున్నారు. మార్చి 28 న సోమవారం పూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ అనంతరం.. ఆ రోజు మధ్యాహ్నం నుంచి భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పించనున్నారు.
![Yadadri Maha Kumbha Samprokshanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14843251_pancha.jpg)
ఇదీ చదవండి: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ... అలిపిరి వద్ద బారులు తీరిన వాహనాలు