యాదాద్రి జిల్లా భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట బస్వపురం నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో సుమారు 56 మంది రైతులు ఆందోళన చేపట్టారు. సర్వే నంబర్ 229లో ఉన్న 94 ఎకరాల 24 గుంటల భూమిని 56 మంది రైతులు.. గత కొన్నేళ్లుగా సాగుచేస్తున్నారని.. ప్రాజెక్టు నిర్మాణంతో వారంతా భూములు కోల్పోతున్నారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు.. స్థానిక తహసీల్దార్ పొజిషన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారని గుర్తుచేశారు. ప్రాజెక్టు కింద భూమి కోల్పోతున్న రైతుల జాబితాలో వీరి పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో .. అది సర్కారు భూమని, అందులో ఏ రైతు సేద్యం చేసుకోవడం లేదని నివేదించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా పరిహారం రాకుండా పోయిందని వాపోయారు.
ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు.