వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లు.. హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వారం క్రితం వెలువడ్డాయి. 14 మండలాలతో హన్మకొండ.. 13 మండలాలతో వరంగల్ జిల్లాలు ఏర్పాటయ్యాయి. వరంగల్ పట్టణ, గ్రామీణ జిల్లాలంటే గందరగోళంగా ఉందని.. హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా పేర్లు మార్చారు. జిల్లాల పేర్లు మారి అప్పుడే వారం గడిచింది. అయినా ఈ గందరగోళానికి తెరపడలేదు. ఇప్పటి వరకు వరంగల్ పశ్చిమ, తూర్పుగా ఉన్న నియోజకవర్గాల పేర్లనూ మార్చాల్సిన అవసరం ఏర్పడింది. హన్మకొండ జిల్లాలో ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండగా.. వరంగల్ జిల్లాలో ఉన్న వరంగల్ తూర్పు.. వరంగల్ నియోజకవర్గంగా మార్పు జరగాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఎన్నికల సంఘంతో మాట్లాడి.. అసెంబ్లీ నియోజకవర్గాల పేర్ల మార్పునకు ప్రయత్నిస్తే ఈ గందరగోళానికి తెరపడుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు జిల్లాల పేర్లు మారి వారం గడిచినా.. చాలా ప్రభుత్వ కార్యాలయాల నామఫలకాలు ఇంకా మారలేదు. దీంతో రెండు జిల్లాల ప్రజలు, అధికారులు అయోమయానికి గురవుతున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు రెండు జిల్లాల్లో ఉండటం మరో సమస్యగా మారుతోంది. కాకతీయ వైద్య కళాశాల, వెటర్నరీ ఆసుపత్రి, పాలిటెక్నిక్ కళాశాల, కేంద్ర కారాగార ప్రాంతం.. ఇవన్నీ హన్మకొండలో కొంత, వరంగల్లో కొంత అన్నట్లుగా ఉన్నాయి. దీంతో ఇవి ఏ జిల్లాకు వస్తాయన్న దానిపై స్పష్టత లేదు. బోర్డులపై ఏ జిల్లా పేరు రాసుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
విచిత్రాలకూ కొదవలేదు..
ఇదిలా ఉండగా.. జిల్లాల పేర్ల మార్పుతో కొన్ని విచిత్రాలూ నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గాలు రెండు జిల్లాల్లోనూ ఉన్నాయి. వరంగల్ కార్పొరేషన్ సైతం రెండు జిల్లాల పరిధిలోకి వస్తుంది. మేయర్ గుండు సుధారాణి నివాసం హన్మకొండలోనూ.. కార్యాలయం వరంగల్ జిల్లాలోనూ ఉండగా.. ప్రాతినిథ్యం వహిస్తోన్న రామన్నపేట డివిజన్ హన్మకొండలోకి వచ్చేసింది.
ఇదివరకు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రాతినిథ్యం వహించే మండలాల్లో పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు మండలాలు హన్మకొండ జిల్లాలోకి రాగా.. గీసుకొండ, సంగెం మండలాలు వరంగల్ జిల్లాలోనే ఉన్నాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రాతినిథ్యం వహించే మండలం పర్వతగిరి వరంగల్ జిల్లాలో ఉండగా.. హసన్పర్తి, కాజీపేట, ఐనవోలు మండలాలు.. హన్మకొండలో ఉన్నాయి.
ఒకచోట గెలుపు.. మరోచోట బాధ్యతలు..
గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఆయన మండలమైన శాయంపేట తాజాగా హన్మకొండలోకి వచ్చి చేరింది. వరంగల్ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి శాయంపేట జడ్పీటీసీ నుంచి గెలుపొందగా.. అది హన్మకొండలోకి వచ్చేసింది. దీంతో ప్రాతినిథ్యం వహించే జడ్పీటీసీ ఒక జిల్లాలో ఉంటే.. చైర్ పర్సన్గా బాధ్యతలు మాత్రం వేరే జిల్లాలో నిర్వర్తించాల్సి వస్తోంది. ఈ గందరగోళాలన్నింటికీ తెరపడాలంటే ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాల్సిందేనని ఆయా జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారు.
సంబంధిత కథనాలు..