కాంగ్రెస్, భాజపాలు తెరాసకు పోటీ కావని పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రచారానికి వస్తున్న ప్రతిపక్ష నేతలను.. పరకాల, భూపాలపల్లి వాసులు తరిమారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ చైనా, పాకిస్థాన్ యుద్ధ వాతావరణంపై ప్రచారంతో పబ్బం గడుపుకుంటోందని చెప్పారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పునాది లేదని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు తెరాస ముందు నిలవలేవని స్పష్టం చేశారు. వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో నాయకులు సమష్టిగా కృషి చేయాలని... ఓటర్ల నమోదు ఇంటింటికి తిరిగి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
![minister errabelli on elections in warangal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-17-21-minister-fire-on-konda-sureka-ab-ts10076_21092020195335_2109f_03184_267.jpg)
పట్టభద్రుల ఓటరు సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి... కార్పొరేటర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బూత్ కమిటీల నాయకులు రాకపోవడంపై మంత్రి ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఐదు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఎప్పుడు ఎన్నికలకు పిలుపునిచ్చిన కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని అన్నారు.