How to Make Rice Idli at Home: మెజార్టీ జనాల ఇంట్లో మార్నింగ్ టిఫెన్గా ఇడ్లీ ఉంటుంది. ఎందుకంటే ఇది లైట్గా ఉండి ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా తేలిక. అందుకే చాలా మంది వారానికి ఓ రెండు మూడు రోజులైనా ఇడ్లీలు చేసుకుని తింటుంటారు. ఇక ఇడ్లీలు చేయాలంటే ఇడ్లీరవ్వ కచ్చితంగా ఉండాల్సిందే.
అందుకు అనుగుణంగానే మార్కెట్కు వెళ్లినప్పుడు కేజీల కొద్దీ ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటారు. అయితే ఇడ్లీ రవ్వ లేకుండా కేవలం బియ్యంతో కూడా రుచికరమైన, మృదువైన ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. పైగా ఇవి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మరి లేట్ చేయకుండా రైస్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- మినపప్పు - 1 కప్పు(200 గ్రాములు)
- మెంతులు - 1 టీ స్పూన్
- రేషన్ బియ్యం - 3 కప్పులు(600 గ్రాములు)
- అటుకులు - అర కప్పు
- సన్నటి గోధుమ రవ్వ - అర కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
- బియ్యంతో ఇడ్లీలు చేయాలంటే ముందు రోజు రాత్రి ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి పులిస్తేనే ఇడ్లీలు చాలా మృదువుగా, టేస్టీగా ఉంటాయి. కాబట్టి పిండిని ముందే సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఓ బౌల్లోకి మినపప్పు, మెంతులు తీసుకుని ఓ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసుకుని సుమారు 5 గంటల పాటు నానబెట్టుకోవాలి.
- మరో గిన్నెలోకి రేషన్ బియ్యం తీసుకుని శుభ్రంగా కడగాలి. వీటిని కూడా సేమ్ 5 గంటలపాటు నాననివ్వాలి.
- మినపప్పు, బియ్యం బాగా నానిన తర్వాత మరోసారి రెండింటిని విడివిడిగా కడగాలి. అలాగే పిండి గ్రైండ్ చేసుకునే ఐదు నిమిషాల ముందు ఓ గిన్నెలోకి అటుకులు, కొన్ని నీళ్లు పోసి నాననివ్వాలి.
- మిక్సీజార్ తీసుకుని మినపప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే మిక్సీజార్లోకి నానబెట్టిన అటుకులు, నానబెట్టిన బియ్యం కొన్ని వేసి కొన్ని నీళ్లు పోసుకుంటూ అటు మరీ మెత్తగా, మరీ బరకగా కాకుండా చేతితో పట్టుకుంటే సన్నటి రవ్వలాగా అనిపించేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మినపప్పు పిండి వేసిన గిన్నెలోకి కలుపుకోవాలి. అలాగే మిగిలిన నానిన బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు ఓ చిన్న గిన్నెలోకి సన్నటి గోధుమరవ్వ తీసుకుని ఓసారి కడిగి, మినపప్పు, బియ్యపిండి ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి.
- తర్వాత మినపప్పు, బియ్యం, గోధుమరవ్వ మూడు బాగా కలిసేలా కలపాలి. ఆ తర్వాత గిన్నెపై మూత పెట్టి రాత్రి మొత్తం అలానే ఉంచాలి.
- ఉదయాన్నే పిండి బాగా పులిసి కనిపిస్తుంది. అప్పుడు మరోసారి బాగా కలిపి, అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి అందులో సరిపడా నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి.
- ఈలోపు ఇడ్లీ ప్లేట్స్కు నూనె లేదా నెయ్యి రాసుకుని పిండిని వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్లోకి పిండిని వేసుకోవాలి.
- ఇడ్లీ పాత్రలో నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ పెట్టి మూత పెట్టాలి. ఆపై మంటను మీడియంలో ఉంచి 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఓ 5 నిమిషాల తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుని పల్లీ చట్నీ, కారప్పొడితో తింటే సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరూ ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
పప్పు రుబ్బే పనిలేదు - చిటికెలో "సేమియా ఇడ్లీ" - టేస్ట్ అద్దిరిపోతాయి!
ఇడ్లీ పిండితో రుచికరమైన "పునుగులు" - ఇలా చేస్తే టేస్ట్ అద్దిరిపోతాయి!
పప్పు నానబెట్టి రుబ్బాల్సిన పనే లేదు - ఈ పదార్థాలతో నిమిషాల్లో అతి మృదువైన ఇడ్లీలు రెడీ!