ధరణి పోర్టల్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆస్తిపన్ను అసెస్మెంట్ల డేటా ప్రకారం నగరంలో 2.10 లక్షల ఇళ్లు ఉన్నాయి. ఇంటి నంబర్ల వారీగా వివరాలన్నీ ఈ పోర్టల్లో అనుసంధానం చేశారు.
ఆస్తిపన్ను అసెస్మెంట్(ఇంటి నంబరు) కలిగిన ఇంటింటికెళ్లి సర్వే చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజులుగా ఆస్తుల వివరాల నమోదు చేపడుతున్నారు. ఇంటి నంబర్లు లేనివి, లెక్కల్లో ల్లేని ఆస్తులు నమోదు చేయడం లేదు. ఆస్తిపన్ను చెల్లించి ఉంటేనే నమోదు చేస్తామని గ్రేటర్ ఉద్యోగులంటున్నారు. మా ఇళ్లు ఎందుకు చేయడం లేదని స్థానిక ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. ఈ సమస్యను కలెక్టర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఆస్తులకు సంబంధించి మూడు, నాలుగు రకాలైన సమస్యలున్నాయి. వీళ్లకు యాజమాన్యపు హక్కు(ఓనర్షిప్) లేదు. ఆస్తుల నమోదుతోనైనా శాశ్వత పరిష్కారర చూపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే ఈ వివరాలన్నీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు నివేదించారు. త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అధికారులంటున్నారు.
వివరాలిలా..
- తాత్కాలిక నిర్మాణాలు(సూపర్ స్ట్రక్చర్లు) 14వేల పైచిలుకు ఉన్నాయి. వీటన్నంటికీ రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లేవు. ఓనర్షిప్, అసెస్మెంటు కాపీలు లేకుండా తాత్కాలిక పద్ధతిన ఇంటి నంబర్లు కేటాయించారు. ఈ డేటా ధరణి పోర్టల్లో ఎంట్రీ కావడం లేదు.
- సుమారు 6 వేల ఇళ్లకు ఆస్తిపన్ను అసెస్మెంట్లు లేవు. వీటిని ఎలా లెక్కల్లోకి తీసుకుంటారనేది చిక్కు ప్రశ్న. 80శాతం పేద ప్రజలే ఉన్నారు.
- ప్రభుత్వ, చెరువు శిఖం స్థలాల్లో ఐదు వేల వరకు గుడిసెలు ఉన్నాయి. వీటిలో ఉంటున్న వారికి హోల్డర్ కింద ఇంటి నంబర్లు కేటాయించినా, స్థలాలపై యాజమాన్యపు హక్కు లేనందున ఆస్తుల నమోదు చేయడం లేదు.
- కరీమాబాద్, ఉర్సు, రంగశాయిపేట, ఖిలావరంగల్, లేబర్కాలనీ, దేశాయిపేట, రంగంపేట, రామన్నపేట, మచిలీబజారు, కుమార్పల్లి, కాజీపేట తదితర ప్రాంతాల్లో ఐదు వేల ఇళ్లకు రిజిస్ట్రేషన్లు లేవు. అబాది కింద ఉన్నాయి. వీటిని ఏం చేయాలనేది తేల్చలేదు.
ఇదీ చూడండి> క్షణాల్లో చేరుతాయ్.. ప్రాణాలు నిలుపుతాయ్!