వరంగల్ గ్రామీణం జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ పరిధిలో పరకాల, నడికూడ, శాయంపేటతోపాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ మండలాలున్నాయి. మార్కెట్ కింద చిట్యాల, శాయంపేటలో సబ్ మార్కెట్ యార్డులుండేవి. పత్తి, ధాన్యం, మిర్చి, మక్కలు, ఇతర అపరాల క్రయ విక్రయాలతో మార్కెట్కు ఏటా రూ.3కోట్లకు పైగా ఆదాయం సమకూరేది. జిల్లాల పునర్విభజనలో పరకాల, శాయంపేట మినహా మిగిలిన మండలాలన్నీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలిశాయి.
రెండు జిల్లాలకు విస్తరించిన మార్కెట్..
ఇప్పటి వరకు జిల్లాలు వేరైనా మార్కెట్ కమిటీ రెండు జిల్లాలకు విస్తరించింది. ఈ సమయంలో మార్కెట్ను విభజించి నూతన మార్కెట్లను ఏర్పాటు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గతేడాది జూన్ 28న వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్రెడ్డికి లేఖ రాశారు. ఆ మేరకు కొత్తగా భూపాలపల్లి, చిట్యాల మండలాల్లో రెండు మార్కెట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సబ్ మార్కెట్గా ఉన్న చిట్యాల పరిధిలోకి చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలను చేర్చారు. ఇక భూపాలపల్లిలో కొత్తగా మార్కెట్ను ఏర్పాటు చేసి భూపాలపల్లి, రేగొండతో పాటు ములుగు జిల్లాలోని ములుగు వ్యవసాయ మార్కెట్ పరిధిలోని గణపురం మండలాన్ని కలిపారు. పరకాల మార్కెట్ పరిధిలో పరకాల, నడికూడ, శాయంపేట మండలాలు మాత్రమే మిగిలాయి.
ఉద్యోగుల, సిబ్బంది పంపకాలు ఇవే...
పరకాల మార్కెట్ పరిధిలో ఇద్దరు సూపర్వైజర్లు, 12 మంది సెక్యూరిటీ గార్డులు పనిచేసేవారు. అందులో నుంచి చిట్యాల మార్కెట్కు ఒక సూపర్వైజర్ను, ముగ్గురు సెక్యూరిటీ గార్డులను, భూపాలపల్లి మార్కెట్కు ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కేటాయించారు. పరకాల మార్కెట్కు ఒక సూపర్వైజర్, ఏడుగురు సెక్యూరిటీ గార్డులు మాత్రమే మిగిలారు. ఇప్పటికే పరకాల మార్కెట్కు ఇన్ఛార్జి కార్యదర్శి విధుల్లో ఉండగా రెగ్యులర్ అధికారి రావాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన రెండు మార్కెట్లలో కార్యదర్శులు పని చేస్తున్నారు. కొత్త మార్కెట్కు కేటాయించిన ఉద్యోగులు మూడు నెలల నుంచే ఆయా చోట్ల విధులను నిర్వర్తిస్తున్నారు.
మూడు మార్కెట్లకు ఆదాయ పంపకం..
పరకాల వ్యవసాయ మార్కెట్కు అన్ని మండలాల నుంచి వచ్చిన పంటల దిగుబడుల క్రయ విక్రయాలతో సుమారు రూ.7కోట్లు నిల్వగా ఉన్నాయి. మార్కెట్ విభజన జరగడంతో నిబంధనల ప్రకారం ఉద్యోగులు, సిబ్బందితోపాటు ఆదాయం పంపకాలు జరగాలి. ప్రస్తుతం పరకాల మార్కెట్లో ఉన్న ఆదాయాన్ని మూడు మార్కెట్లకు పంచారు. కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి మార్కెట్ జిల్లా కేంద్రంలో ఉండటంతో దాని అభివృద్ధికి రూ.2.50కోట్లు, చిట్యాల మార్కెట్కు రూ.1.50కోట్లు కేటాయించారు. ఆ నిధులతో మార్కెట్ల అభివృద్ధి జరగాల్సి ఉంది.
పంపకాల ప్రతిపాదనలు పంపాం..
ఆదాయ పంపకాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాం. అనుమతి లభించిన వెంటనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. భూపాలపల్లి జిల్లా నుంచి గతేడాది ధాన్యం, మక్కలు, పత్తి వంటి వ్యాపారాల ఆదాయం పరకాల మార్కెట్కు ఇవ్వాలి. ఆ రకంగా రూ.1.20కోట్లు ఆదాయం సమకూరుతుంది.
-సోమశేఖర్, పరకాల మార్కెట్ కార్యదర్శి
ఇదీ చదవండి: ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం!