ఇటీవల కురిసిన వర్షాలకు వికారాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు సత్వరం మరమ్మతులు చేపట్టాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. జిల్లా పాలనాధికారి కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 65 శాతం పెసర, 35 శాతం బెబ్బర్లు, రెండు శాతం కంది, పంటలకు నష్టం జరిగిందని వెల్లడించారు.
క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు పర్యటించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటి వరకు 95 శాతం రైతు బీమాకు సంబంధించిన డబ్బులు చెల్లించామని పేర్కొన్నారు. అవసరమైన యూరియా సిద్ధంగా ఉందన్నారు. 97 రైతు వేదికల నిర్మాణ పనులు చేపట్టారని 48 వేదికలు పునాదుల స్థాయిలో ఉన్నాయన్నారు. గండ్లు పడిన చెరువులకు మరమ్మతు చేపట్టి పూర్తి చేయాలన్నారు. శివారెడ్డిపేట చెరువు ఆక్రమణలను తొలగించాలని సూచించారు.
సర్పంచుల సహకారంతో గ్రామాల్లో టీవీ ప్రసారాలను విద్యార్థులు చూసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాండూరు, కేరెల్లి రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, జిల్లా పాలనాధికారిణి పౌసుమిబసు, వికారాబాద్, పరిగి, కొడంగల్, చేవెళ్ల ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి, కాలె యాదయ్య, అధికారులు పాల్గొన్నారు.