వికారాబాద్ జిల్లాలో 60 కిలో మీటర్ల పొడవునా ప్రవహించే కాగ్నానదిపై మూడు చోట్ల రూ.9.52కోట్ల వ్యయంతో నిర్మించిన ఆనకట్టలు ప్రయోజనకారిగా మారాయి. వృథాగా పోయే నీటిని నిలువరించడంతో తాగు, సాగునీటి వనరుల్లో జలమట్టం పెరగడానికి దోహదపడింది. జిల్లాలోని వికారాబాద్, బంట్వారం, పెద్దేముల్, మర్పల్లి, మోమిన్పేట, కోట్పల్లి, ధారూర్ మండలాల్లో కురిసిన నీరు వరదగా మారి కాగ్నానదిలోకి చేరింది. దోమ, బొంరాస్పేట మండలాల్లో కురిసిన వర్షపు నీరు కాకరవేణి, ఆ తర్వాత కాగ్నానదిలోకి వచ్చింది. కోట్పల్లి జలాశయం నిండాక వృథాగా మారిన నీరు కూడా కాగ్నా నదిలోకి చేరింది.
చాలా ఏళ్ల నుంచి కాగ్నానదిలోకి చేరిన వరదను కట్టడి చేసేందుకు ఎలాంటి ఆనకట్టలు లేవు. నీటిని నిలువరిస్తే బహుళ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు భావించారు. ఈ మేరకు 2015లో నీటిపారుదల శాఖ రూ.8.52 కోట్లను వ్యయం చేసి తాండూరు పట్టణ సమీపం పాత తాండూరు కాగ్నానదిపై 280 మీటర్ల పొడవు ఆరు మీటర్ల ఎత్తులో ఆనకట్ట నిర్మాణం చేపట్టింది. తాండూరు పట్టణానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న వీర్శెట్టిపల్లి, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణపూరు గ్రామాల సమీపం కాగ్నానదిపై పంచాయతీ రాజ్శాఖ రూ.కోటి వ్యయం చేసి ఏడాది కిందటే రెండు ఆనకట్టల నిర్మాణం చేపట్టింది. ఈ ఏడాది భారీగా కురిసిన వర్షాలకు కాగ్నానది నుంచి దిగువకు వచ్చిన వరద ఆనకట్టలను నింపేసింది.
కిలో మీటరు పొడవునా నీటి నిల్వ..
పాత తాండూరు ఆనకట్టలో కిలో మీటరు పొడవునా నీటి నిల్వ ఉంటే వీర్శెట్టిపల్లి, నారాయణపూరు ఆనకట్టల్లో అర కిలో మీటరు పొడవునా నీటితో కళకళలాడుతోంది. తాజా పరిణామంతో కిలో మీటరు విస్తీర్ణంలో భూగర్భజలం గణనీయంగా పెరిగింది. పొలాల్లో వేసిన బోర్లలో పది అడుగుల ఎత్తుకు నీటి మట్టం పెరిగింది. బోర్లలో పెరిగిన నీటిని ఆధారం చేసుకుని రైతులు అరటితోటలు, కూరగాయలు, ఆరుతడి పంటలు సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు.
![kagna river fill due to the recent heavy rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9761436_kagna.jpg)
పెరిగిన పంటల సాగు...
గతంలో ఆనకట్టల్లో నీరు నిలవకముందు పరివాహక ప్రాంతాల్లో బోర్ల ఆధారంగా 500 ఎకరాల్లోనే వరి, కూరగాయలు వంటివి సాగయ్యేవి. ప్రస్తుతం ఆనకట్టల్లో నీరు ఉండడంతో అదనంగా 1300 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. దీనికి తోడు సమీప గ్రామాల్లోని చేతిపంపులు, తాగునీటి సరఫరా బోర్లలోనూ జలమట్టం గణనీయంగా పెరిగింది. వేసవిలో ఇక నీటి ఎద్దడి లేకుండా చేసింది. పాత తాండూరు కాగ్నా ఆనకట్ట ఆధారంగా 900ఎకరాల్లో పంటలు సాగతున్నాయని నీటిపారుదల శాఖ సహాయ ఇంజినీరు నికేశ్కుమార్ తెలిపారు. వీర్శెట్టిపల్లి, నారాయణపూరు ఆనకట్టల ఆధారంగా పెరిగిన భూగర్భ జలమట్టం పెరగడంతో 300 ఎకరాల్లో అదనంగా పంటల సాగుకు అవకాశం ఏర్పడిందని తాండూరు పంచాయతీరాజ్ శాఖ డీఈఈ వెంకట్రావు తెలిపారు.
ఇదీ చూడండి: ఏసీబీ వలకు చిక్కిన ఉప గణాంక అధికారి