YS Sharmila Padayatra: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర కొనసాగుతోంది. ఓ వైపు పాదయాత్రలో పాల్గొంటూనే మరోవైపు ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం గుండేపురి గ్రామంలో షర్మిల పాదయాత్ర చేపట్టారు. అనంతరం వైతెపా ఆధ్యర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వా నేనా అన్నట్లుగా ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నాయని షర్మిల మండిపడ్డారు.

చమురు ధరలతో పాటు విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పెరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ఐదేళ్లలో గ్యాస్ ధరలు రెట్టింపయ్యాయని.. చమురు ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కారణమేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ విద్యుత్ ఛార్జీలను పెంచడం తగదన్నారు. రేట్లు తగ్గించకుంటే ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. భాజపా, తెరాసలకు తగిన సమయంలో బుద్ధి చెప్పకుంటే.. బతుకులు బుగ్గిపాలవుతాయని షర్మిల అన్నారు.

ఇదీ చదవండి: Bandi Sanjay Request to NRIs : 'తెరాసపై భాజపా పోరాటానికి మద్దతుగా నిలవండి'