సూర్యాపేట జిల్లా చిలుకూరులోని బాపూజీ శాఖా గ్రంథాలయం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఎంతో ఘనచరిత్ర ఉంది. 1941లో నాటి కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత రావి నారాయణరెడ్డి చేతుల మీదుగా రైతు గ్రంథాలయంగా ఏర్పడి 1972 ఏప్రిల్ 16న హుజూర్నగర్ ఎమ్మెల్యే దొడ్డ నర్సయ్య చొరవతో ప్రభుత్వ గ్రంథాలయంగా మారింది.
తొలి తెలంగాణ ఉద్యమ నాయకుల్లో ఒకరైన రావినారాయణరెడ్డి ఊపిరి పోసిన గ్రంథాలయం అది. 15వేల పుస్తకాలకు నిలయంగా... ఎంతో మందిని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దిన బాపూజీ గ్రంథాలయమది. ఆంధ్రమహాసభ సమయంలో పురుడు పోసుకున్న ఆ విజ్ఞాన ఘని నేడు శిథిలమవుతోంది!
15 వేల పుస్తకాలు...
ఈ గ్రంథాలయం దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 15వేలకు పైగా గ్రంథాలతో విరాజిల్లుతోంది. పాఠకులను మేధావులుగా తీర్చిదిద్దుతోంది. జాతీయోద్యమం, నైజాంకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ పోరాటం సాగుతున్న కాలంలో బాపూజీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 1959లో నాయిని అలివేలు మంగమ్మ తన స్థలాన్ని విరాళంగా ఇవ్వడంతో ఈ స్థలంలో నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య నాయకత్వంలో విరాళాలు సేకరించి 1972లో రైతు గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయంగా ఏర్పాటు చేశారు.
నిత్యం 500 మందికి పైనే...
ప్రతిరోజూ 500 మందికి పైగా సందర్శించే ఈ గ్రంథాలయంలో పురాణాల దగ్గర నుంచి నేటి ఆధునిక సాంకేతిక వరకు వేల సంఖ్యలో పుస్తకాలు లభ్యమవుతున్నాయి. విద్యార్థులకు పాఠశాల పుస్తకాలలో లేని విషయాలను గ్రంథాలయంలో తెలుసుకోవడం జరుగుతుంది.
ఎన్నో పుస్తకాలకు నిలయం
గరుడ పురాణం, పల్నాటి కథలు, భారత రాజ్యాంగం, భారత స్వాతంత్రోద్యమం, తెలంగాణా రైతాంగ పోరాటం, భగవద్గీత, శ్రీశ్రీ, దాశరథి కృష్ణమాచార్యులు, నారాయణరెడ్డి మొదలగు మేధావుల పుస్తకాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. మాస పత్రికలు, వారాంతపు పత్రికలు రోజువారి పత్రికలు ఈ గ్రంథాలయంలో దొరుకుతాయి. దొడ్డా నర్సయ్య జ్ఞాపకార్థం నూతనంగా రీడింగ్ హాలును నిర్మించారు. ఇదే గ్రంథాలయంలో చదువుకొని ఎంతోమంది ఉన్నత శిఖరాలకు ఎదిగి వివిధ హోదాల్లో ఉన్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
ఎంతోమందిని మేధావులుగా తీర్చిదిద్దిన ఆ విజ్ఞాన భాండాగారం నేడు శిథిలావస్థకు చేరింది. ఓ ఉద్యమ నేత పేరుతో పురుడుపోసుకున్న, ఓ ముఖ్యమంత్రి స్వయంగా కితాబిచ్చిన ఆ గ్రంథాలయం నేడు 'గతం' కాబోతోంది. దానిని కాపాడుకోలేకపోతే భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేసినట్టే..!?