సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామంలో ఓ మహిళ ఒంటిపై పోట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడింది. తమ ఇంటి వద్ద నెలకొన్న భూవివాదంలో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి వేధింపులు భరించలేక కందుకూరి పద్మ నిప్పంటించుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తీవ్ర గాయాలైన మహిళను కుటుంబ సభ్యులు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
భూమి గురించి పద్మకు గ్రామానికి చెందిన వేరే వ్యక్తితో గత కొన్ని రోజులుగా భూ వివాదం జరుగుతోంది. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎంపీటీసీ సభ్యులు సదరు వ్యక్తి కి మద్దతుగా మాట్లాడుతూ నానా ఇబ్బందులకు గురి చేశారని బాధితురాలి భర్త ఆరోపించారు. ఇవాళ తీవ్రపదజాలంతో తిట్టగా మనస్తాపానికి గురై పద్మ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడినట్లు ఆయన తెలిపారు.
వెంటనే గమనించి మంటలను ఆర్పి భార్యను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ బత్తిని సాయిలు, కార్యదర్శి ఎల్లయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్ వేధింపుల నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలని వేడుకున్నారు. తమ భూమి తమకు వచ్చేలా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి ఎల్లయ్యను వివరణ కోరగా భూమికి సంబంధించి గత కొన్ని రోజులుగా అంజయ్యకు పక్కనే ఉన్న మరో వ్యక్తికి వివాదం జరుగుతోందని తెలిపారు.
స్థలం ఎవరిదనే విషయాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత గోడ కట్టుకోవాలని సూచించినా కూడా పనులు చేస్తున్న క్రమంలో ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బందితో పనులను అపే ప్రయత్నం చేయగా అంజయ్య భార్య పద్మ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుందన్నారు.