సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో 40 ఎకరాల భూ వివాదం విషయంలో గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఎస్సీ రైతుల దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సతీశ్ కుమార్ సందర్శించారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఇంతకుముందు వివాదంలో ఉన్న 40 ఎకరాలకు ఇచ్చిన పట్టా పాసు పుస్తకాలను రద్దు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టుకు కూడా నివేదించామని పేర్కొన్నారు.
ప్రస్తుతం 40 ఎకరాల భూ వివాదం హైకోర్టులో పెండింగ్లో ఉందని.. కోర్టు తీర్పు వచ్చే వరకు 40 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగానే కొనసాగుతుందని, ఆ భూమిపై ఇక మీదట ఎవరికి ఏ విధమైన హక్కులు ఉండవని సతీశ్ కుమార్ వెల్లడించారు. రైతులు చేస్తున్న దీక్షకు ప్రభుత్వం, అధికారులు స్పందించి వివాదంలో ఉన్న భూమి పాసు పుస్తకాలు రద్దు చేశారని, కోర్టు తుది తీర్పును అనుసరించి అది ఎవరికి కేటాయిస్తే వారికే ఉంటుందన్నారు. ఇక రిలే నిరాహార దీక్షను విరమించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సతీశ్ కుమార్ విజ్ఞప్తి మేరకు ఎస్సీ రైతులు తమ రిలే నిరాహార దీక్షను విరమించుకున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్