సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బ్యాంకుల ఎదుట ఖాతాదారులు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరుతున్నారు. బ్యాంకుల సమయం కుదించడంతో ఖాతాదారులు బ్యాంకు సేవలను వినియోగించుకోవడానికి వేకువజామునే వచ్చి క్యూలో నిల్చుంటున్నారు. ఎక్కువ మంది రావడంతో బ్యాంకుల ముందు రద్దీ ఏర్పడింది. కొన్ని బ్యాంకుల ఎదుట భౌతిక దూరం పాటిస్తూ క్యూలో నిలబడినప్పటికీ... మరికొన్ని బ్యాంకుల ఎదుట కరోనా నిబంనలను పాటించడం లేదు. గుంపులు గుంపులుగా చేరి క్యూలో నిలబడుతున్నారు.
రైతులందరూ ధాన్యం అమ్ముకున్న డబ్బులు తీసుకోవడానికి వస్తుండగా బ్యాంకుల ఎదుట రద్దీ నెలకొంటుంది. కొన్ని బ్యాంకుల ఎదుట ఖాతాదారుల సౌకర్యార్థం చలువ పందిళ్లు వేశారు. కానీ మరికొన్ని చోట్ల మాత్రం ఖాతాదారులు ఎండలోనే నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఖాతాదారులు కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు చొరవ చూపాలని, ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున బ్యాంకుల ముంద చలువ పందిళ్లు వేయించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు