Gurukula School Encourages Games: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని బాలికల గురుకుల పాఠశాల చదువుతో పాటు క్రీడలకు వేదికగా మారుతోంది. క్రీడల్లో ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహిస్తుండటంతో అక్కడి విద్యార్థులు ఖోఖో, వాలీబాల్లో నైపుణ్యం సాధించారు. స్టూడెంట్ ఒలింపిక్ అసోసియేషన్ హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గోని... మొదటి స్థానం సాధించారు. ఆ తర్వాత పంజాబ్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లోనూ మొదటి స్థానంలో నిలిచారు.
ఇక్కడ చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. చాలామంది వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చిన వారే ఉన్నారు. పంజాబ్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వీరికి సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చవుతాయని తెలిసింది. దీంతో జిల్లా కలెక్టర్ శరత్... విద్యార్థుల కోసం రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. పంజాబ్ వెళ్లిన విద్యార్థులు అక్కడ సత్తా చాటారు. ఖోఖోలో మొదటి స్థానంలో, వాలీబాల్లో రెండో స్థానంలో నిలిచారు. దీంతో వీరికి శ్రీలంక, నేపాల్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గోనే అర్హత లభించింది.
జనవరి మొదటి వారంలో కొలంబోలో వాలీబాల్, ఖట్మండూలో ఖోఖో పోటీలు నిర్వహించనున్నారు. మన దేశం తరుఫున ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఖోఖోలో ఏడుగురు, వాలీబాల్లో ఐదుగురు ఈ పాఠశాల నుంచి ఎంపికయ్యారు. ఖోఖోలో పాల్గోనే 9 మంది క్రీడాకారుల్లో ఏడుగురు జహీరాబాద్ గురుకుల పాఠశాల నుంచే ఎంపికవడం విశేషం. ఈ పోటీల్లో పాల్గొంనేందుకు ఒక్కో విద్యార్థికి సుమారు 70 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. రోజంతా పని చేస్తేనే పూట గడవని ఆర్థిక పరిస్థితిలో ఉన్న ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు 70వేల రూపాయలు అంటే మోయలేని భారమే. దాతలు సాయం చేస్తే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడానికి విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
ఇవీ చదవండి: