సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని పిలెట్స్ ఫార్మా పరిశ్రమలో డ్రయ్యర్ పేలడం వల్ల భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో పరిశ్రమ మేనేజర్ రామకృష్ణ మంటలకు ఆహుతై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పరిశ్రమలోని డ్రయ్యర్ పేలడం వల్లే అగ్నిప్రమాదం సంభవించింనట్టు సిబ్బంది చెప్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మేనేజర్ రామకృష్ణ అక్కడే ఉండడం వల్ల పూర్తిగా మంటల్లో కాలిపోయాడు. పరిశ్రమ పైఅంతస్తులో ఉన్న డ్రయ్యర్ ఒక్కసారిగా పేలడం వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. భారీ పేలుడుకు చుట్టుపక్కల ఉన్న అద్దాలన్నీ పగిలిపోయాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే పనిచేస్తున్న మేనేజర్ రామకృష్ణ కనిపించకపోగా.. అనుమానించిన కార్మికులు శిథిలాల కింద వెతికారు. పూర్తిగా కాలిపోయి మాంసపు ముద్దగా మిగిలిన రామకృష్ణ మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రసాయనాల పొగలు పీల్చుకున్న శ్రీకాంత్ అనే కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బీడీఎల్ భానూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. రోడ్డుకు మోక్షం