కాంక్రీట్ జంగిల్గా మారిన బడంగ్పేట
రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్త... ఇళ్ల ముందు అస్తవ్యస్థంగా మారిన మురుగునీటి వ్యవస్థ.... విచ్చలవిడిగా తవ్విన రహదారులతో దర్శనమిస్తున్న ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలంలోని బడంగ్పేట. నిజాం కాలంలో పెద్ద పెద్ద గడీలతో అలరారిన ఈ గ్రామం కాలక్రమంలో కాంక్రిట్ జంగిల్గా మారింది. హైదరాబాద్కు సమీపంలోనే ఉండడంతో... ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా బడంగ్పేట చుట్టూ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. పెరుగుతున్న జనాభాతోపాటు పాలనా సౌలభ్యం కోసం... ఐదేళ్లలోనే బడంగ్పేటను పురపాలక సంఘంగా మార్చారు. గతేడాది జులైలో ప్రభుత్వం బడంగ్పేట పురపాలక సంఘాన్ని... నగర పాలక సంస్థ స్థాయికి చేర్చింది.
చెత్త డబ్బా తీసుకెళ్లాలంటే చేయి తడపాల్సిందే..!
ఏడేళ్లలో బడంగ్పేట నగరపాలక సంస్థ జనాభా వేల నుంచి లక్షలు దాటింది. సుమారు 2 లక్షలకుపైగా జనాభా ఉండగా... 32 వార్డులున్నాయి. ఈ కార్పొరేషన్కు 38 కోట్ల 30 లక్షల వార్షిక ఆదాయం వస్తోంది. పంచాయతీల నుంచి నగరపాలక సంస్థగా ఎదిగినా... అభివృద్ధిలో ముందుకెళ్లడం లేదు. తాగునీటి సమస్య మొదలు మురుగునీటి వ్యవస్థ, అధ్వాన్నపు రహదారులతో ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రధాన రహదారుల వెంట చెత్త పేరుకుపోతోంది. కొన్ని ప్రాంతాలు మురికిగుంటలుగా మారి పందులకు ఆవాసాలుగా మారిపోయాయి. చెత్త, చెదారం చేరి దోమలు, ఈగలు పెరిగిపోతున్నాయి. అపరిశుభ్ర వాతావరణం వల్ల పురవాసులు అనేక మంది రోగాలబారిన పడుతున్నారు. ఇంటి ముందు చెత్త డబ్బా తీసుకెళ్లడానికి కూడా... సిబ్బంది చేయి తడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి కోసం ఇక్కట్లు..రోడ్లపై నడవాలంటే ఇబ్బందులు..
బడంగ్పేటలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు మిషన్ భగీరథ పథకం కింద ప్రభుత్వం 6 ట్యాంకుల నిర్మాణం చేపట్టింది. అందులో మూడు పూర్తి కాగా మరో మూడు అసంపూర్తిగా ఉన్నాయి. ఫలితంగా సరిపడా తాగునీరు సరఫరా లేక పలుకాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతర్గత రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. 10ఏళ్ల కిందట హోంమంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి... ఫిసల్బండ నుంచి నాదర్గూల్ వరకు బాహ్యావలయ రహదారికి అనుసంధానంగా రేడియల్ రోడ్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అది ఇంతవరకు అమలు జరగలేదు. బడంగ్పేటలోని పలు కాలనీల్లో రోడ్లు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతోన్న బడంగ్పేట కార్పొరేషన్లో ప్రజల సౌకర్యార్థం ఒక్క ఆస్పత్రి కూడా లేకపోవడం శోచనీయం. తలాపు నుంచే కృష్ణానీరు నగరానికి తరలిపోతున్నా...తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కంటే ఎక్కువగా నగరపాలక సంస్థలో పన్నులు చెల్లిస్తున్నామని... అయినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇలా ఎన్నో సమస్యలతో అల్లాడుతోన్న బడంగ్పేట కార్పొరేషన్కు తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. బడంగ్ పేట ఛైర్మన్ పదవికి జనరల్ మహిళకు రిజర్వేషన్ ఖరారు కావడంతో తెరాస ఈ కార్పొరేషన్ ను దక్కించుకోవాలని ధృడ నిశ్చయంతో ఉంది. అలాగే ఎప్పటి నుంచో తమకే దక్కుతున్న స్థానాన్ని కాంగ్రెస్ పదిలపర్చుకోవాలని భావిస్తోంది..
ఇవీ చూడండి:వింటే నామినేటెడ్ పదవులు.. లేకుంటే వేటే!