పెద్దపల్లి జిల్లా మంథనిలో సౌభాగ్యం కోసం మహిళలు భక్తి శ్రద్ధలతో వటసావిత్రి వ్రతం ఆచరించారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కలకాలం సిరి సంపదలు, పాడి పంటలు వృద్ధి చెందుతాయని మహిళలు భావిస్తున్నారు. ఏటా జ్యేష్ఠ మాసంలో వివాహితులైన స్త్రీలు ఈ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోందని... పురోహితులు తెలిపారు.
పురాణాల ప్రకారం...
పూర్వం సతీ సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతున్ని మృత్యువు నుంచి కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆ సమయంలో నారద మహర్షి ఉపదేశానుసారం వ్రతం ఆచరించి... భర్తను మృత్యువు నుంచి రక్షించుకుంటుంది. ఆ వ్రతమే వటసావిత్రి వ్రతమని పురాణాల్లో భక్తుల నమ్మకం. ఆ రోజునే... తెలుగింటి ఆడపడుచు ఏటా... తన భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారని పురోహితులు తెలిపారు.
వృక్షానికి పూజలు...
ఎంతో ప్రత్యేకత కలిగిన వట సావిత్రి వ్రతాన్ని... ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజున మహిళలు వారి ఆచారం ప్రకారం ఆచరిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో రావిచెట్టుకు, మరికొన్ని ప్రాంతాల్లో మర్రిచెట్టు దగ్గర మహిళలు కూర్చొని... ఆ వృక్షాన్ని అశ్వత్థ నారాయణునిగా భావించి... లక్ష్మీదేవి సహితంగా పూజలు నిర్వహిస్తారు. మరి కొన్ని ప్రాంతాల్లో శివపార్వతులుగా భావించి మొక్కుతున్నారు. చెట్టుకు ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని చుట్టి గౌరమ్మ పూజలు నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: High Court: ఠాణాలో మహిళ మృతిపై న్యాయ విచారణకు హైకోర్టు ఆదేశం