లాక్డౌన్ నేపథ్యంలో రామగుండం కర్మాగారంలో పనుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇవ్వడంతో బుధవారం పనులు పునఃప్రారంభమయ్యాయి. ట్రాన్స్కో నుంచి 40 మెగావాట్ల విద్యుత్తు, శ్రీపాదసాగర్(ఎల్లంపల్లి) నుంచి 0.5 టీఎంసీల నీరు, కేజీ బేసిన్ నుంచి 2 ఎం.ఎం.ఎస్.సి.ఎం.డి.(మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే) గ్యాస్ సరఫరా సాగనుంది. కర్మాగారంలో రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కానుండగా రాష్ట్రంతో పాటు దేశ అవసరాలను తీరనున్నాయి. ఇప్పటికే వివిధ విభాగాల్లోని యంత్రాల పనితీరుపై నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి.
‘కిసాన్’ లోగో.. ఎన్ఎఫ్ఎల్ మార్కెటింగ్
పరిశ్రమలో రోజుకు 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేయనున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్.ఎఫ్.సి.ఎల్.)లో భాగస్వామిగా ఉన్న నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్.ఎఫ్.ఎల్.)కు ఇప్పటికే మార్కెటింగ్ రంగంలో అనుభవం ఉండడంతో ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఎరువుల మార్కెటింగ్ బాధ్యతలను ఆ సంస్థ చేపట్టనుంది.
ఎన్ఎఫ్ఎల్కు చెందిన ‘కిసాన్’లోగోతోనే రామగుండం యూరియా అమ్మకాలు చేపట్టనున్నారు. ఉత్పత్తిదారుల స్థానంలో మాత్రం రామగుండం ఎరువుల కర్మాగారం పేరును ముద్రించే అవకాశముంది. గతంలో ఇక్కడ మూతపడిన ఎఫ్సీఐ కర్మాగారంలో ఉత్పత్తి అయిన యూరియాను ఇదే తరహాలో మరో పరిశ్రమ పేరుతో మార్కెటింగ్ చేయగా తర్వాత సొంతంగా నిర్వహించారు.
రూ.6,120 కోట్లు.. ఆరుగురి భాగస్వామ్యం
రూ.6,120 కోట్ల వ్యయంతో చేపట్టిన కర్మాగారంలో ఆరు సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇందులో అత్యధికంగా నేషనల్ ఫెర్టిలైజర్స్ ఇండియా లిమిటెడ్, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థలు 26 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి.
కర్మాగారం నిర్మాణం కోసం స్థలంతో పాటు కొన్ని భవనాలను అప్పగించిన ఎఫ్సీఐకి 11 శాతం భాగస్వామ్యం ఇవ్వగా, కర్మాగారం నెలకొల్పేందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం, అమ్మోనియా ప్లాంటు నిర్మాణం చేపట్టిన డెన్మార్కుకు చెందిన హల్దర్టాప్ సంస్థకు 11.7 శాతం, గ్యాస్ సరఫరా చేస్తున్న గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా 14.3 శాతం భాగస్వామ్యంతో నిర్మాణ పనులు చేపట్టారు.