పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సమీకృత సంక్షేమ బాలుర వసతి సముదాయంలో విద్యార్థులకు కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలలో 15 మంది ఉపాధ్యాయులు, 86 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. ముగ్గురు విద్యార్థులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వసతి గృహంలో 47 మంది విద్యార్థుల్లో ఒకరికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది.
విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ రావడంపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు.. ఆవరణంతా శానిటైజేషన్ చేపట్టాలని కోరుతున్నారు. చాలా మంది తమ పిల్లలను ఇళ్లకు తీసుకుపోతున్నారు. మూడు రోజుల తర్వాత మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని వైద్య సిబ్బంది తెలిపారు.
మూడు రోజుల క్రితం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒక ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా ఆ పాఠశాల ఆవరణలో కొంత మంది విద్యార్థులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఆందోళన కలిగిస్తోంది.
ఇవీచూడండి: పాఠశాల విద్యార్థులకు సెలవులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం