పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సీపీఐ ఆధ్వర్యంలో హత్రస్ నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నా నిర్వహించారు. దిష్టిబొమ్మ దహనం చేసి.. కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు లైంగిక వేధింపులను చట్టాలు ఆపలేకపోతున్నాయని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ మీద దృష్టి పెట్టడం లేదని సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కందుకూరి రాజారత్నం ఆరోపించారు.
నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినా.. కామాంధుల వికృత చేష్టలకు అడ్డుకట్ట పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురై యువతి మృతి చెందిన ఘటన కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుచేటని అన్నారు. యువతిని అత్యాచారం చేసి.. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసికా మోహన్, సీపీఐ నగర సహాయ కార్యదర్శి తలపెల్లి మల్లయ్య, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: బాబ్రీ మసీదు కేసు.. పూర్తి కథనాలు