నిజామాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు 50 కొవిడ్ పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలున్న ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కొన్ని ప్రాంతాల్లో లక్షణాలు లేనివారు కూడా పరీక్షలు చేయించుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరికైతే లక్షణాలుంటాయో వారిని గుర్తించే పనిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఉన్నారని, అవసరమైన వారిని గుర్తించి పరీక్షా కేంద్రాలకు వెళ్లమని వారే సూచిస్తారని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు దాదాపు 2500 ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలు, పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా పరీక్షలు చేస్తున్నామని, ఫలితాలు, బాధితుడి లక్షణాల ఆధారంగా చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని, హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి ఉచితంగా మెడికల్ కిట్లు అందిస్తున్నామన్నారు. పాజిటివ్ వచ్చి లక్షణాలు తీవ్రంగా ఉంటే.. వారిని జిల్లా ఆస్పత్రికి పంపి.. చికిత్స అందిస్తున్నామని, మామూలు లక్షణాలు ఉండి.. ఇల్లు చిన్నగా ఉన్నవారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నామని కలెక్టర్ అన్నారు. మెడికల్ ఆఫీసర్, ఎమ్మార్వోకు ఫోన్ చేస్తే వారు ఐసోలేషన్కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తారన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్నవారు ప్రభుత్వ పాఠశాలల్లో ఐసోలేషన్లో ఉంచే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో హోమ్ ఐసోలేషన్లో ఉంటూ ఇప్పటి వరకు 1500 మంది కోలుకున్నారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే చాలని కలెక్టర్ సూచించారు.
ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ