నిజామాబాద్ బల్దియా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధారణ అంచనా బడ్జెట్ రూ.390.92 కోట్లకు ఆమోదించారు. నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం మేయర్ నీతూ కిరణ్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఖర్చులు, రాబడి ఇతర విషయాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ.గౌడ్, ఎమ్మెల్యేలు గణేశ్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, కమిషనర్ జితేష్.వి.పాటిల్ హాజరయ్యారు.
భాజపా కౌన్సిలర్ల ఆందోళన..
మరోవైపు నిధుల కేటాయింపుపై భాజపా కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. తెరాస, ఎంఐఎం సభ్యుల డివిజన్లకు రూ.10 లక్షలు కేటాయించారు... భాజపా సభ్యుల డివిజన్లలో రూ.5 లక్షలే కేటాయించడం దారుణమని సభ్యులు న్యాలం రాజు, మల్లేశ్ యాదవ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే గణేశ్గుప్తా జోక్యం చేసుకొని అన్ని డివిజన్లకు సమానంగా రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తామన్నారు.
దుకాణాల కేటాయింపులో వారికే ప్రాధాన్యం..
అహ్మదీ బజార్లోని శంభుని గుడి వద్ద ఆక్రమణలు తొలగించి వారికి కొత్తగా అక్కడే నిర్మిస్తున్న మార్కెట్లో దుకాణాలు కేటాయించాలని మల్లేశ్ యాదవ్, న్యాలం రాజు పేర్కొన్నారు. దీనికి ఎమ్మెల్యే గణేశ్గుప్తా స్పందిస్తూ.. అహ్మదీ బజార్లో మార్కెట్ భవనాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించి రూ. 6.50 కోట్లతో కొత్తవి నిర్మిస్తున్నామన్నారు. అక్కడున్న వారికే మొదట ప్రాధాన్యం ఇస్తామన్నారు.