నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగపూర్లో అన్నదాతలతో భట్టి విక్రమార్క ముఖాముఖి నిర్వహించారు. తెలంగాణ వస్తే బాధలు తీరి బాగు పడతామని రైతులు భావిస్తే.. రెట్టింపు కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు ఏమైపోయినా.. నేను నా కుటుంబం చాలు అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర అందక చేస్తున్న పోరాటాల గురించి రైతులు వివరించారు. నీళ్లు నిధుల కోసం తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలవుతోందని భట్టి విమర్శించారు. స్వరాష్ట్రంలో అన్నదాతల బాధలు తీవ్రమయ్యాయని అన్నారు. ఎస్సారెస్పీ వరద కాల్వ లీకేజీ నీటి కోసం రోడ్డెక్కిన రైతుల మీద అక్రమ కేసులు బనాయించడం అన్యాయమన్నారు.
కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం... వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ఈనెల 27న రైతుల సమస్యలపై ఛలో హైదరాబాద్ కార్యక్రమం కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతున్నామని.. రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి