రాష్ట్రంలో బీడీ కార్మికులందరికీ జీవనభృతి అమలు చేయాలని నిజామాబాద్ జిల్లా ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.2016 చెల్లించాలన్నారు. సీఎం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలంటూ ఇందల్వాయి మండల కేంద్రంలో బీడీ కార్మికులతో ర్యాలీ చేపట్టారు.

ఇప్పటి వరకు 2014 లోపు పీఎఫ్ ఖాతా ఉన్న వారికి మాత్రమే జీవనభృతి చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా 30 శాతం మందికి ఎలాంటి భృతి రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా గెలిచాక బీడీ కార్మికులందరికీ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు, ఏఐకెఎమ్ఎస్ ప్రతినిధులు ఉన్నారు.