నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం అయ్యప్ప నామ సంకీర్తనలు, శరణుఘోషతో సోమవారం మారుమోగింది. కార్తీకమాసం తొలి రోజును పురస్కరించుకొని హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామికి సుప్రభాత సేవ అనంతరం పంచామృతాలతో అభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అష్టాభిషేకం, వివిధ రకాల పూలతో స్వామివారిని అలంకరించి పూజలు నిర్వహించారు.
భక్తులు ఉదయం ఆలయానికి చేరుకొని సమీపంలోని స్వర్ణ వాగు, సోన్ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్వామి మాలను ధరించారు. దీక్షలో పాటించాల్సిన నియమ నిబంధనలను, జాగ్రత్తలను ఆలయ గురుస్వామి నర్సారెడ్డి వివరించారు. నిర్మల్తో పాటు నిజామాబాద్కు చెందిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ ధర్మశాస్త్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: యాదాద్రిలో కార్తీక శోభ... రోజుకు ఆరు బ్యాచ్లకు అనుమతి