ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాల అమలు, సాధించిన పురోగతిపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
![collector musharraf farooquie review on palle pragathi programme in nirmal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10330448_951_10330448_1611245870235.png)
ఆర్థిక పురోగతి సాధించేందుకు..
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో నిలిచేందుకు, ఆర్థిక పురోగతి సాధించేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు పల్లె ప్రగతిలో వివిధ నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని, ఇకనుండి వాటిని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రతి గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా సేకరణ, వర్మి కంపోస్టు తయారీ తదితర అంశాలపై సుదీర్ఘంగా వివరించారు.
ప్రత్యేక అభినందనలు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్.. నిర్మల్ జిల్లా పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికల నిర్మాణంలో రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిచిందన్నారు. అందుకు సమష్టిగా కృషి చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్ పడే, జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి శంకరయ్య, ఎంపీడీవోలు, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.