రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అనుబంధ డిజిథాన్కు మరోమారు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. డిజిథాన్ ద్వారా నిర్వహించిన తెలంగాణ ఎర్లీ కోడర్స్కు స్కోచ్ అవార్డు సొంతమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సరైన శిక్షణ అందిస్తే... ఎంతటి ప్రతిభ చూపిస్తారో.. కోడింగ్ స్కిల్స్ శిక్షణ రూపంలో స్పష్టం చేసినందుకు ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డు దక్కింది. 69వ స్కోచ్ అవార్డుల్లో ప్రకటించిన ఈ అవార్డును నారాయణపేట కలెక్టర్ హరిచందన స్వీకరించారు.
జిల్లాలోని విద్యార్థుల సత్తాను దేశానికి చాటిచెప్పిందని కలెక్టర్ హరిచందన అన్నారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల సారథ్యంలోని బృందం దాదాపు మూడు నెలల పాటు నిరంతరంగా చేసిన కృషి ఫలితంగా విద్యార్థులు అధునాతన నైపుణ్యాలు సొంతం చేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తాము విద్యార్థులకు అందించిన శిక్షణను స్కోచ్ సంస్థ గుర్తించడం సంతోషకరమని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల అన్నారు. సహకరించిన జిల్లా అధికారులకు, వాలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు