నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు, ముఖ్య నాయకులతో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ పాల్గొన్నారు.
ఏం చేశారో చెప్పాలి:
భాజపా, తెరాస పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అవినీతి పరుడని.. విద్యాసంస్థల్ని కాపాడుకోవడం కోసమే సీఎం కేసీఆర్ పక్కన చేరాడని ఉత్తమ్ ఆరోపించారు. ఆయన గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మళ్లీ మోసం:
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మళ్లీ మోసం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కుటుంబంలో మాత్రమే అందరికీ ఉద్యోగాలు వచ్చాయని.. నిరుద్యోగులు అలాగే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్కే సీఎం కేసీఆర్ పరిమితం అయ్యారని విమర్శించారు. హాలియా సభలో గిరిజన మహిళల పట్ల సీఎం అసభ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ను గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి: ముస్లిం మహిళల తొలి కథా సంకలనం 'మొహర్' ఆవిష్కరణ