భూ దస్త్రాల ప్రక్షాళనలో భాగంగా నమోదు చేసిన పార్ట్-బీలో ఉత్పన్నమవుతున్న సమస్యలను 60 రోజుల్లో పరిష్కరించేలా సమగ్ర కార్యాచరణ ప్రారంభించాలని ఇటీవల సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో పాటు పలువురు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు.
న్యాయస్థానాల పరిధిలో ఉన్నవి మినహాయించి మిగతావి కలెక్టర్లే క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పార్ట్ -బీ సమస్యలతో పాటు ఇటీవల నమోదు చేసుకున్న సాదాబైనామాలు, కాల్వ భూములన్న సర్వే నెంబర్లను రిజిస్ట్రేషన్లలో బ్లాక్ లిస్టులో పెట్టగా పలుచోట్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. పార్ట్- బీ సమస్యలతో పాటు సమస్యలను పరిష్కరించాలని వారు అధికారులను కోరుతున్నారు. మరోవైపు కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు ఇవ్వగా సంబంధిత అధికార యంత్రాంగం వివాదాలున్న భూములను క్షేత్రస్థాయిలో త్వరలోనే విచారణ చేయనుంది.
సాదాబైనామాలకు మోక్షం ఎప్పుడో ?
తెల్ల కాగితంపై రాసుకున్న భూ క్రయవిక్రయాలకు సంబంధించి చట్టబద్ధత కల్పించడానికి సాదాబైనామా రిజిస్ట్రేషన్లు సహా పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన సమావేశంలోనే వీలైనంత త్వరగా సాదాబైనామాలను పరిష్కరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. దీంతో త్వరలోనే దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం ఉంది. గతేడాది నవంబరు 10న తుది గడువు ముగిసే నాటికి ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు స్వీకరించారు.
భూ వివాదాలు
ఉమ్మడి జిల్లాలో ఏఎమ్మార్పీ, సాగర్ ఎడమ కాల్వ, ఎస్సారెస్పీ స్టేజ్-2 కాల్వలు చాలా చోట్ల రైతుల నుంచి కొనుగోలు చేసిన పట్టా భూముల్లో నుంచే వెళ్తున్నాయి. వీటిని గతంలోనే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు పరిహారం అందించింది. ఆ భూములూ చాలా చోట్ల రైతుల పేరుతోనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఒక సర్వే నెంబరులో కొంత భూమి తీసుకున్నా ఆ సర్వే నెంబరులో పూర్తిగా రైతుల పేరును తొలగించారు. కొన్ని చోట్ల కాలువ భూమిలో నుంచి వెళ్లింది, రికార్డుల్లో పేర్కొన్నదాంట్లో భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. దీంతో పలు చోట్ల ఇది వివాదాలకు కారణమవుతోంది.
* ఉదాహరణకు మిర్యాలగూడ పట్టణంలోని 803 సర్వే నెంబరులో 9.29 ఎకరాల భూమి ఉంది. ఇందులో నుంచే 1.09 ఎకరం భూమిలో నుంచి సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని ముదిమాణిక్యం మేజర్ కాలువ వెళ్తోంది. అయితే భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా కాలువ 11 గుంటల నుంచి మాత్రమే వెళ్తోందని నమోదు చేశారు. దీంతో మిగిలిన 38 గుంటల స్థలం పూర్వ పట్టాదారుల పేరిట ఉండటంతో వారు దీనిని సాగు కోసం రాగా... అధికారులు, పట్టాదారుల మధ్య వివాదం సాగుతోంది.
* మిర్యాలగూడ రైల్వేస్టేషన్ సమీపంలోని సర్వేనెంబరు 222- 1 లో ఉన్న 2.01 ఎకరాల భూమి పట్టణానికే చెందిన రిటైర్డు అధ్యాపకులు రామచంద్రయ్య పేరిట ఉంది. ఈ భూమి విషయమై కేసులో కోర్టు రామచంద్రయ్యకే అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇందులోనే ఎకరం తమ పేరిట ఉందని ఆరోపిస్తూ కొందరు ఇటీవల భూమిపైకి వచ్చారు. దీంతో ఇరువర్గాల నడుమ వివాదం గ్రామీణ పోలీసుల దృష్టికి రాగా స్థలం విషయం తేలేంత వరకు నిర్మాణాలు జరపరాదని పోలీసులు సూచించారు. దీన్ని ఉల్లంఘించి సదరు వ్యక్తులు ఈ భూముల్లో యథేచ్ఛగా నిర్మాణాలు సాగిస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో సరైన విధంగా వివరాలను నమోదు చేసుంటే వివాదం వచ్చేది కాదని తెలుస్తోంది.
* కోదాడ పురపాలిక పక్కనున్న దాదాపు 18 గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్త్ట్రేషన్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని గ్రామాల్లోని సర్వే నెంబర్లైతే ఆన్లైన్లోనూ కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు.
* నిడమనూరు మండలం సూరపల్లి శివారులో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాల్వలు ఉన్నాయి. కాలువ భూములను పట్టా భూములను ఒకే సర్వే నంబరులో పెట్టడంతో ధరణిలో రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఇలాంటి సమస్యలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే హైదరాబాద్ నుంచి పరిష్కారం కావాలని చెబుతున్నారు.
* సూరపల్లి శివారులోని 170 సర్వే నంబరులో మొత్తం 15.22 ఎకరాల భూ మి ఉంది. ఇందులో ఎనిమిది గంటలు మా త్రమే నాగార్జున సాగర్ కాల్వ భూమి ఉంది. కానీ మిగితా ఉన్నా పట్టాభూములు ధరణిలో రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉంది.