ధనుర్మాసం ప్రారంభమైన 27వ రోజున కూడారై ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ ఆండాలు శ్రీ ఆళ్వార్ల సహిత శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో 40వ మార్గళి ఉత్సవము సందర్భంగా కూడారై ఉత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడలో తెల్లవారుజాము నుంచే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 108 గంగాళములలో ప్రత్యేకంగా తయారు చేసిన పాయస ప్రసాదమును అర్చకులు చక్రవర్తుల గోపాలాచార్యులు స్వామివారికి నివేదించారు.
అనంతరం గోదాదేవి రచించిన తిరుప్పావై ద్రావిడ ప్రబంధము భక్తులు భక్తిశ్రద్ధలతో పారాయణం చేశారు. దేవాలయ నిత్య పూజ శాశ్వత నిధికి హైదరాబాద్లోని కార్వాన్ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ పాపని శ్రీమన్నారాయణ, వైష్ణవి దంపతులు రూ. 25,116 విరాళము సమర్పించారు. దేవాలయ వ్యవస్థాపక ఛైర్మన్ పాపని జనార్దన్ కూడారై ఉత్సవ ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు ఆనందం కృష్ణయ్య పాల్గొన్నారు.