నల్గొండ జిల్లాలో మరోసారి కరోనా వైరస్ జాడలు వెలుగు చూశాయి. పాజిటివ్ కేసులు తగ్గుతున్న క్రమంలో.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికుల్లో వైరస్ లక్షణాలు కనిపించడం వల్ల.. వెంటనే వైద్యశాఖ అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు.
వలస కార్మికుడిలో వైరస్
ముంబయి నుంచి స్వగ్రామానికి చేరుకున్న కట్టంగూరు మండలానికి చెందిన వ్యక్తిలో కరోనా వైరస్ వెలుగుచూసింది. ఈ నెల 13న ఓవ్యక్తి స్వగ్రామానికి చేరుకున్నాడు. తనకు వైరస్ సోకిందన్న అనుమానంతో ఇంటికి చేరుకోకముందే భార్య, ఇద్దరు పిల్లల్ని బంధువుల ఇంటికి పంపించాడు. అప్పట్నుంచి దగ్గుతో బాధపడుతుండటం వల్ల నల్గొండ కొవిడ్ సెంటర్ తరలించి.. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయింది. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కంటైన్మెంట్లపై ప్రత్యేక నిఘా
యాదాద్రి భువనగిరి జిల్లాలో గత రెండ్రోజులుగా ఎలాంటి కేసులు నమోదు కాకున్నా.. ఇప్పటికే వైరస్ బారిన పడ్డ ఏడు మండలాల్లోని ప్రభావిత పల్లెల్లో జాగ్రత్త చర్యలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలోనూ కేసులు లేకున్నా.. ఇప్పటికీ 2,886 మంది హోం క్వారంటైన్లలో ఉన్నారు.
మంత్రి జగదీశ్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించి ముస్లింలకు రంజాన్ కానుకలు అందజేశారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఆన్ లైన్ ప్రవేశాలు నిర్వహిస్తున్న.. మిర్యాలగూడలోని నారాయణ ఇ-టెక్నో పాఠశాలను అధికారులు సీజ్ చేశారు.
వలస కూలీలకు బస్సు ఏర్పాటు చేసిన కాంగ్రెస్
లాక్ డౌన్ కారణంగా..వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సొంత రాష్ట్రానికి వెళ్లలేని కార్మికుల కోసం.. కాంగ్రెస్ పార్టీ బస్సు ఏర్పాటు చేసింది. నల్గొండ నుంచి 30 మంది వలస కూలీలను తరలించగా.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. అంతకుముందు బీఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో.. మిర్యాలగూడ, వేములపల్లి మండలాల్లో పేద ముస్లింలకు రంజాన్ సామగ్రి పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదల