ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ను గెలిపించాలని జానారెడ్డి కోరారు. ప్రజలను దోచుకుంటున్న తెరాసకు తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా నిడమనూరు మండల తుమ్మడంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
అంతకుముందే జానారెడ్డి హాలియాలోని పలువురు కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. గుర్రంపోడు మండలం నుంచి వచ్చిన తెరాస నాయకులను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. అధికార తెరాసకు తగిన గుణపాఠం చెప్పేందుకు సాగర్ ఉపఎన్నిక కీలకమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సాగర్ అభివృద్ధికి దశాబ్దాలుగా కృషి చేసిన జానారెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, దామోదర్ రెడ్డి ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.