నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలో కలెక్టర్ ఎల్ శర్మాన్ చౌహాన్ పర్యటించారు. హరితహారం, రైతు వేదిక నిర్మాణాలు, డంపింగ్ యార్డు, వైకుంఠధామాలు, పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఆవంచ, మారేపల్లి, ఇప్పలపల్లిలో రైతు వేదిక నిర్మాణ పనులు చేపట్టలేదని సర్పంచ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు చేతనైతే చేయండి లేకపోతే కాంట్రాక్టర్తో పని చేయించండి. కానీ సాకులు చెప్పొద్దని అసహనం వ్యక్తం చేశారు.
పోతిరెడ్డిపల్లి, మారేపల్లి, గుమ్మకొండలో వీధులు, మురుగు కాలువలు, శివార్లను పరిశీలించారు. పేరుకుపోయిన మట్టిని కట్టె పుల్ల పెట్టి ఎంత పేరుకోపోయిందో పరిశీలించారు. ఇంత దరిద్రంగా గ్రామాలుంటే... ఎందుకు అధికారులను, సర్పంచ్లను సస్పెండ్ చేయొద్దని ప్రశ్నించారు. రెండు రోజుల్లో గ్రామాలన్నీ శుభ్రం కావాలని ఆదేశించారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.