రైతులందరూ సంఘటితమై పార్టీలకతీతంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా పోరాడటానికి సంసిద్ధం కావాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు. నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ బంద్ను చేపట్టారు. భారీగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. ట్రాక్టర్ల ర్యాలీ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు నిర్వహించారు.
భాజపా ప్రభుత్వం రైతుల కోసం చేసిందేమీ లేదని ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంటే ఆ పథకాలకు కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతుందన్నారు. దేశంలో అన్ని పార్టీలు ఈ వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ ఉంటే.. చర్చల పేరిట మోదీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం కళ్లు తెరచి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల