మానవాళి మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్న ప్లాస్టిక్ నిషేధం ములుగు జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యమంలా సాగుతోంది. ఉన్నతాధికారి నుంచి.. క్షేత్రస్థాయి ఉద్యోగి వరకు.. విద్యావంతుల నుంచి బడికి వెళ్లే పిల్లల వరకు ములుగు జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పక్కా ప్రణాళికతో ప్లాస్టిక్ను తిరిగి వెనక్కి తీసుకురావడంతో పాటు ఇప్పటి నుంచి ఒక్క సంచి బయటకు వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 174 పంచాయతీల్లో ఈనెల 16 నుంచి 26 వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కిలో ప్లాస్టిక్కు కిలో సన్న బియ్యాన్ని ఇచ్చారు. ఫలితంగా 44 వేల కిలోలు సేకరించారు. అంతేకాక ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాల కోసం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దర్జీలను అందుబాటులో ఉంచి గుడ్డ సంచులను తయారు చేసి ఇస్తున్నారు. ఇలా 40 వేల సంచులను మహిళా సంఘాల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ములుగు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు కలెక్టర్ కంకణం కట్టుకున్నారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ను వినియోగించకుండా గట్టి చర్యలు చేపట్టారు. స్వయం సహాయక బృందాలతో కాగితం, వస్త్ర సంచుల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు.
చినుకు చినుకు కలిస్తే జడివానగా మారినట్లు ప్లాస్టిక్ నివారణపై చేయి చేయి కలిస్తే.. ములుగు ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారే రోజు మరెంతో దూరంలో లేదనిపిస్తోంది.
ఇవీచూడండి: ' దీపావళి తర్వాత ప్లాస్టిక్ వాడితే జరిమానా '