ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనిగూడెం-బూర్గంపాడు ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి కాంగ్రెస్, భాజపా నేతలు మద్దతు తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు సన్నరకం వరి సాగు చేస్తే.. అకాల వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు నేలకొరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత నష్టం వాటిల్లినా ఇంత వరకూ అధికారులు సర్వే చేయలేదని వాపోయారు. నష్టపోయిన పంటల వివరాలపై ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన పంట నష్టం అంచనా వేయాలని కోరారు.
ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రైతులకు నచ్చజెప్పారు. ఆందోళన విరమించిన రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి వినతి పత్రం అందజేశారు.
ఇదీ చూడండి.. నాలుగు లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం: మంత్రి కేటీఆర్