Ktr at College Inauguration: రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఏవియేషన్ యూనివర్శిటీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా బహదూర్పల్లిలో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. అవకాశాలు అందిపుచ్చుకోవడం ద్వారానే మనం ఉన్నత శిఖరాలను చేరుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చదువులో అయిపోగానే ఉపాధి వచ్చే కోర్సులు అందించాలని మంత్రి కోరారు. విద్యాశాఖలో 68 ఏళ్లలో జరగని అభివృద్ధి ఎనిమిదేళ్లలోనే చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
విద్యా ప్రమాణాల పెంపునకు మేం కృషి చేస్తున్నాం. ఎనిమిదేళ్లలో విద్యశాఖపై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ప్రాథమిక విద్యా నుంచి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఎలాంటి లోటు రాకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. గురుకుల పాఠశాల విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించడం మామూలు విషయం కాదు. విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు మెరుగుపరుస్తున్నాం. - కేటీఆర్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కొక్క రంగాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తున్నారని విద్యాశాఖ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దేశంలోనే ఆదర్శవంతంగా గురుకులాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని గురుకులాల్లో 1050 జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసినట్లు వివరించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్ది, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, వాణీదేవి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ.. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశానిర్దేశం