కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల మొండి వైఖరి విడనాడాలని కోరుతూ రైతుమహా ప్రదర్శన ధర్నా పేరిట కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మేడ్చల్ కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి నందికంటి శ్రీధర్ను పోలీసులు అడ్డుకుని గృహనిర్బంధం చేశారు.
రైతుల కోసం పోరాడుతున్న తమను అరెస్టు చేయడం సరైన చర్య కాదని శ్రీధర్ అన్నారు. తెలంగాణ సర్కార్.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. కనీస మద్దతు ధర కోసం రోడ్లపైకి వచ్చిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అన్నదాతల సమస్యలు తీరే వరకు తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని, ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.