హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నర్సరీ లు ఏర్పాటు చేశామని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం రామాయంపేట పట్టణంలో తెరాస పార్టీ కార్యాలయం, డంప్ యార్డ్ తో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. పల్లెలు పట్టణాలు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకురావడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురికాకుండా ఆ స్థలాలలో నర్సరీలు, డబుల్ బెడ్ రూములు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
రామాయంపేట పట్టణంలో ఇప్పటికే 75% మిషన్ భగీరథ పనులు పూర్తి చేయడం జరిగిందని, త్వరలో వైకుంఠ ధామాలను ఏర్పాటు చేస్తామన్నారు. రామాయంపేట, నిజాంపేట పరిధిలో కొంత మంది బీడీ కార్మికులకు పెన్షన్ రాలేదని వారందరికీ పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు.
మల్లెం చెరువును మినీ ట్యాంక్ బండ్గా రూపుదిద్దుతాం..
భవిష్యత్తులో మల్లెం చెరువుకు నిధులు మంజూరు చేసి మినీ ట్యాంక్ బండ్గా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు చేపట్టి భవిష్యత్తులో కాళేశ్వరం నీటి ద్వారా నింపుతామన్నారు.
త్వరలో కేటీఆర్ రాక..
రామాయపేట పట్టణంలో.. 300 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటుగా రైతు వేదిక ప్రారంభోత్సవానికి త్వరలో తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ ఛైర్మన్ జితేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'అప్పటివరకు సాగు చట్టాలు నిలిపివేయగలరా?'