విధుల్లో నిర్లక్ష్యం వహించిన మెదక్ జిల్లా.. కౌడిపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహమ్మద్ అజహరుద్దీన్ నిజామికి జిల్లా కలెక్టర్ యం.హనుమంత రావు మెమో జారీ చేశారు. ప్రకృతి వనాల ఏర్పాటు, ధరణి పోర్టల్, వరి ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో అన్ని మండలాల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీకి నిజామి ఆలస్యంగా రావడమే గాక బాధ్యతారాహిత్యంగా సమావేశం మధ్య నుండే లేచి వెళ్లిపోయాడు. పలుమార్లు ఇదే విధంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది. అంతేకాక మండల స్థాయి అధికారుల సమీక్షా సమావేశానికి కూడా గైర్హాజరవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం ఎం.పి.డి.ఓ అందుబాటులో లేకపోవడం, అనధికారికంగా గైర్హాజరు కావడం విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ మెమో జారీ చేశారు. మెమో అందిన రెండు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని లేనిచో సి.సి.ఎ. నియమ నిబందనల ప్రకారం చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు.
ఇవీ చదవండి: 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది: మెదక్ కలెక్టర్