klio pharma company: క్లియో ఫార్మా కంపెనీ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ... మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంతో పాటు మూడు గ్రామాలకు చెందిన రైతులు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ఉన్న దశలోనే ఆపేసేలా ఆదేశాలు జారీ చేయాలని అడిషనల్ కలెక్టర్ రమేష్కు వినతిపత్రం అందజేశారు. కంపెనీని నిర్మించడం వల్ల పది కిలోమీటర్ల వరకూ కాలుష్యం అవుతుందని వారు వాపోయారు.
![klio pharma company](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14990382_klio2.jpg)
'ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. భవిష్యత్ తరాలకు నష్టం వాటిల్లుతుంది. వాటి అనుమతులను వెంటనే రద్దు చేయాలి. రెండు పంటలు పండే భూమిలో ఒకే పంట పండుతుందని చెప్పి.. కంపెనీ ఏర్పాటు చేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. కంపెనీ ఏర్పాటు చేయడం ద్వారా ఖాజాపూర్తో పాటు నాలుగు గ్రామపంచాయతీల పరిధిలోని ప్రజలు త్రాగే మంచి నీరు, పశువులు త్రాగే నీరు, భూములు, చెరువులు కలుషితమవుతాయి.' -గ్రామస్థులు
కంపెనీకి 300 మీటర్ల దూరంలో రాజుగారి కుంట ఉంది. దానిమీద ఆధారపడి చాలా మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు ఈ పరిశ్రమ ఏర్పాటుతో వారు ఉపాధి కోల్పోతామని స్థానికులు వాపోయారు. వెంటనే ఫార్మా కంపెనీకి అనుమతులు ఇవ్వకుండా ఉన్న దశలోనే నిర్మాణం ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని అడిషనల్ కలెక్టర్ని కోరారు.
ఇదీ చదవండి:BJP Raithu Deeksha: 'వడ్లు కొనాలి.. లేదంటే సీఎం కేసీఆర్ గద్దె దిగాలి'